ఏదేమైనా ఏపీ మాజీ మంత్రి వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు. ఏపీ సీఎం, తన సోదరుడు అయిన జగన్కు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేస్తున్నట్టుగా ఉండగా… ఆమెకు కొన్ని పత్రికలు బాగా ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆమెను ఏకంగా ధీరవనితగా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సునీత పొలిటికల్ ఎంట్రీపై కడప జిల్లాలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో ఆమె పులివెందుల అసెంబ్లీ బరిలో లేదా కడప లోక్సభ బరిలో ఉంటారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఒకవేళ ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తే వైఎస్ జగన్కు, వైసీపీకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందన్న దానిపై కూడా రకరకాల చర్చలు, వాదనలు మొదలయ్యాయి. ఆమె పోటీ చేస్తే వైసీపీకి నష్టం తప్పదనే అంటున్నారు.
ఆమె ఎన్నికల్లో పోటీ చేసి.. తన తండ్రిని చంపిన వాళ్లను ఓడించాలని పిలుపు ఇస్తే ఫలితాలు అనూహ్యంగా ఉంటాయంటున్నారు. అసలు జగన్ను అందరూ ఒంటరిని చేశారన్న సానుభూతి కడప జిల్లాతో పాటు పులివెందులలో గత కొన్నేళ్లుగా బాగా వర్కవుట్ అవుతోంది. అదే పులివెందుల, కడపలో వైసీపీకి భారీ మెజార్టీ కట్టబెట్టడంతో పాటు జిల్లాలోనూ బాగా పని చేస్తోంది.
ఇప్పుడు సునీతకు కూడా అదే సెంటిమెంట్ వర్కవుట్ అయితే వైసీపీ క్యాండెట్స్కు పెద్ద ఎదురు దెబ్బే అని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏదేమైనా సునీత పోరాటం విషయంలో కడప జిల్లా ప్రజల్లో ఏదో తెలియని సానుభూతి బాగా పెరుగుతోందనే అంటున్నారు. ఇంకా చెప్పాలంటే పులివెందులలో వైఎస్సార్ కంటే కూడా వివేకకే ఎక్కువ క్రేజ్ ఉండేదని కూడా కొందరు చెపుతున్నారు.
వైఎస్ పులివెందుల అసెంబ్లీకి, వివేక కడప ఎంపీగా పోటీ చేస్తే.. పులివెందుల వరకు వైఎస్సార్ కంటే వివేకాకు 3-4 వేల ఓట్ల మెజార్టీ ఎక్కువ వచ్చేదట. తనకంటే వివేకానే ప్రజలతో ఎక్కువుగా ఉంటారన్న విషయం వైఎస్కు తెలుసు. అందుకే ఆయన తమ్ముడిని చూసి గర్వపడేవారని ఎక్కువ మంది చెపుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన కుమార్తె తన తండ్రి హత్య, సెంటిమెంట్ను రగిలిస్తే పులివెందులతో పాటు కడప జిల్లాలో వైసీపీకి పెద్ద షాకులే ఉంటాయంటున్నారు.