నటరత్న ఎన్టీఆర్ గురించి తెలుగువారిని అడిగితే ఆయనో రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు, రావణాసురుడు, శివుడు అని అంటారు. ఎందుకంటే ? ఆయన నటిస్తే ప్రేక్షకులకు ఆ పాత్ర మాత్రమే కనిపిస్తుంది.. పాత్రని పోషించే ఎన్టీఆర్ కాదు. తెలుగు తెరపై పౌరాణిక పాత్రులు అంటే ముందుగా గుర్తుకు వచ్చే నటులలో ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటారు. ఎన్టీఆర్ ఒక సినిమాలో శివుడిగా వేషం వేసినప్పుడు ఆ షూటింగ్ సెట్లో ఆశ్చర్యకరమైన విషయం జరిగింది.
ఎన్టీఆర్ హీరోగా అశ్వినీదత్ నిర్మాణంలో లెజెండ్రీ దర్శకుడు కె.వి.రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ శివుడి పాత్రలో ఒక సినిమా తెరకెక్కింది. ఆ సినిమాకి మరో స్టార్ డైరెక్టర్ సంగీతం శ్రీనివాస్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారు. శివుడు పాత్ర అంటే ప్రధానంగా మెడలో నాగుపాము ఉండాల్సిందేగా.. దానికోసం అప్పట్లో రబ్బర్ పాములు వాడేవారు.
మరికొందరు కోరలు తీసేసిన నిజమైన పాములతోనే షూటింగ్ చేసేవారు. ఎన్టీఆర్కు రబ్బర్ పాము మెడలో వేసుకుంటే ఎలర్జీ వస్తుండడంతో కోరలు తీసేసిన నిజమైన పామునే షూటింగ్లో ఉపయోగించే వారట. ఇక ఎన్టీఆర్ శివుడు గెటప్ వేశాక షాట్ కి రెడీ అయ్యారట. ఈ లోపు పాములు పట్టేవాడు తన దగ్గర ఉన్న కోరలు లేని నాగుపాముకు ట్రైనింగ్ ఇస్తున్నాడట.
ఏం చేస్తున్నారు ? బ్రదర్ అని డైరెక్టర్ ని ఎన్టీఆర్ అడిగారట. మీ మెడలో నాగుపాము నిలబడేలా ట్రైనింగ్ ఇస్తున్నామని డైరెక్టర్ చెప్పారట. దానికి ఎన్టీఆర్ బదులిస్తూ.. “ఏమి అవసరం లేదు. వారిని వదిలేయండి. ఆయనే వస్తారు మెడలోకి” అని చెప్పారట. అది విన్న కె వి రెడ్డి.. “ఆయనికి బ్రెయిన్ ఉందని, పాముకి బ్రెయిన్ ఉంటదని అనుకుంటున్నాడా” అని వ్యాఖ్యానించారట.
అయితే సీన్ స్టార్ట్ అయ్యి, వెనకాల సౌండ్ ప్లే అవ్వడంతో పాము మెల్లిగా కదిలి వెళ్లి ఎన్టీఆర్ మెడకి ఆభరణం అయ్యిందట. ఆ పరిణామానికి సెట్లో ఉన్నవారితో పాటు డైరెక్టర్ ఆశ్చర్యపోయారట. నిజంగా మీరు మహానుభావులు అని ఆ డైరెక్టర్ ఎన్టీఆర్ కి దండం పెట్టేశారట. ఈ విషయాన్ని సీనియర్ నిర్మాత సీ అశ్వినీ దత్ వెల్లడించారు.
ఆయన కామెంట్స్ నేపథ్యంలో ఒకప్పటి ఘటన వెలుగులోకి వచ్చింది. కాగా ఈ ఏడాది ఎన్టీఆర్ 100వ పుట్టినరోజు వేడుక జరుగుతుంది. దీంతో గత ఏడాది మే 28 నుంచే ‘శకపురుషుని శత జయంతి ఉత్సవాలు’ అంటూ సంవత్సరాది వేడుకలను బాలకృష్ణ మొదలు పెట్టాడు. ఇటీవల విజయవాడలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా శత జయంతి అంకురార్పణ సభని ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే.