తెలుగుదేశం పార్టీ చాలా ఏళ్ల నుంచి గెలుపుకు దూరమైన స్థానాల్లో పాణ్యం కూడా ఒకటి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న ఈ సీటులో టిడిపికి పెద్ద పట్టు లేదు..రెడ్డి వర్గం హవా ఉన్న ఈ స్థానం మొదట నుంచి కాంగ్రెస్కు, ఇప్పుడు వైసీపీకి అనుకూలంగా ఉంది. టిడిపి ఇక్కడ రెండుసార్లు మాత్రమే గెలిచింది. 1983, 1999 ఎన్నికల్లోనే గెలిచింది. మళ్ళీ ఎప్పుడు గెలవలేదు..అయితే 20 ఏళ్ల తర్వాత అక్కడ పాగా వేయాలని టిడిపి చూస్తుంది.
మరి పాణ్యంలో ఈ సారైనా టిడిపి జెండా ఎగురుతుందా? మళ్ళీ వైసీపీ కైవసం చేసుకుంటుందా? అనేది ఒకసారి చూస్తే..ప్రస్తుతం పాణ్యంలో రాజకీయ పరిస్తితులు మారుతున్నాయి. వైసీపీకి ఏమి పెద్దగా అనుకూలంగా లేదు..అలా అని టిడిపి పూర్తిగా బలపడలేదు. ఇక్కడ వైసీపీ నుంచి ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ఉన్నారు..గతంలో ఈయన కాంగ్రెస్ నుంచి ఐదు సార్లు గెలిచారు..1985, 1989, 1994, 2004, 2009 ఎన్నికల్లో గెలిచారు.
2014లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి భారీగా ఓట్లు తెచ్చుకుని రెండోస్థానంలో నిలిచారు. అప్పుడు వైసీపీ నుంచి గౌరు చరితా రెడ్డి పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల తర్వాత కాటసాని బిజేపిలో చేరారు..2019 ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చారు. దీంతో పాణ్యం సీటు ఆయనకు ఫిక్స్ అయింది. ఈ క్రమంలో చరితా టిడిపిలోకి వచ్చారు. వీరి మధ్య మళ్ళీ ఫైట్ జరిగింది..ఈ క్రమంలో వైసీపీ నుంచి పోటీ చేసి కాటసాని 43 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు.
అయితే ఇన్ని సార్లు గెలిచిన సరే పాణ్యంలో అనుకున్న మేర అభివృద్ధి జరగలేదు..అటు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత పాణ్యంలో కాటసానికి మైనస్ అవుతుంది. ఇటు టిడిపి నిదానంగా పికప్ అవుతుంది. ఇదే సమయంలో నారా లోకేష్ పాదయాత్ర పాణ్యంలో జరుగుతుంది. ఆ ప్రభావం కాస్త టిడిపికి ప్లస్ అవ్వవచ్చు. అయినా ఇంకా వైసీపీకే ఎడ్జ్ ఉంది. అయితే చరితా రెడ్డి ఇంకా కష్టపడి..రెడ్డి వర్గం ఓట్లు తిప్పుకుంటే పాణ్యంలో గెలిచే ఛాన్స్ ఉంది.. 20 ఏళ్ల తర్వాత ఇక్కడ పసుపు జెండా ఎగరవచ్చు..లేదంటే మళ్ళీ గెలుపుకు దూరమే.