టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్బాబు హీరోగా నటించిన ‘అతిథి’ సినిమాలో నటించింది బాలీవుడ్ బ్యూటీ అమృత రావ్. 2007లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి మార్కులే పడ్డాయి. అమృత ముందుగా ‘అబ్ కే బరాస్’ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి తర్వాత ‘వివాహ్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.
కెరీర్ ఫామ్లో ఉన్నప్పుడే ఆర్జే అన్మోల్ను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. చాలా గ్యాప్ తర్వాత ఆమె బయటకు వస్తోంది. తన తాజా ఇంటర్వ్యూలో అమృతరావు తన పెళ్లి గురించి పలు కీలక విషయాలు చెప్పింది. ‘కపుల్ ఆఫ్ థింగ్స్’ వార్షికోత్సవ స్పెషల్ ఎపిసోడ్కు వచ్చిన అమృత తాము ప్రముఖ ఇస్కాన్ టెంపులో సీక్రెట్గా పెళ్లి చేసుకున్నామని తెలిపింది.
తమ పెళ్లి కోసం కేవలం రూ.1.5 లక్షలు మాత్రమే ఖర్చయ్యిందని.. ఈ మొత్తంలోనే పెళ్లి బట్టలతో పాటు కళ్యాణ మండపం, జర్నీల ఖర్చులు ఉన్నాయని.. అతి కొద్ది మంది దగ్గరి బంధువుల సమక్షంలోనే పెళ్లి జరిగిందని అమృత చెప్పింది. పెళ్లిలో తాను అన్మోల్ డిజైనర్ దుస్తులు కాకుండా ట్రెడిషినల్ దుస్తులు మాత్రమే వేసుకున్నామని.. తమ పెళ్లి దుస్తుల ఖరీదు కేవలం రు. 30 వేలు అని మాత్రమే తెలిపింది.
ఇక పెళ్లి మండపం కోసం కేవలం రు. 11 వేలు ఇచ్చామని.. దగ్గర బంధువులు, స్నేహితులను ఆహ్వానించడంతో పెళ్లికి పెద్ద ఖర్చు కాలేదని తెలిపింది. ఇలాంటి విషయాలు ప్రజలు బడ్జెట్ గురించి అర్థం చేసుకునేందుకు ఉపయోగపడతాయని కూడా అమృత భర్త అన్మోల్ పేర్కొన్నారు. 2016లో పెళ్లి చేసుకున్న ఈ జంట తక్కువ ఖర్చుతోనూ ఆనందంగా పెళ్లి చేసుకోవచ్చని ఫ్రూవ్ చేశారు. ఓ స్టార్ హీరోయిన్ అయ్యి ఉండి కూడా చాలా తక్కువ ఖర్చుతో ఆమె పెళ్లి చేసుకోవడం ప్రశంసనీయం