ఏపీ సీఎం జగన్ తన కేబినెట్లో మార్పులు చేర్పులు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు గత వారం రోజులుగా ఒక్కటే వార్తలు జోరుగా గుపుమంటున్నాయి. జగన్ కచ్చితంగా తన క్యాబినెట్ నుంచి ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులను తప్పించేస్తారని.. వారి స్థానాల్లో కొత్తగా ముగ్గురు ఎమ్మెల్సీలకు చోటు ఇస్తారని ప్రచారం అయితే సాగుతోంది. తీసేసే మంత్రుల జాబితాలో సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో పాటు రాయలసీమ జిల్లాలకు చెందిన మహిళా మంత్రి ఉషా శ్రీ చరణ్ పేరు కూడా వినిపిస్తోంది.
అక్కడి వరకు బాగానే ఉంది కొత్తగా క్యాబినెట్ లోకి వచ్చే మంత్రులు జాబితాలో తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, గుంటూరు జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర్ పేర్లు రేసులో బలంగా ఉన్నాయి. అలాగే రాయలసీమ జిల్లాల నుంచి మూడో మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. గత ఎన్నికలలో చిలకలూరిపేట సీటు త్యాగం చేసినందుకు మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ తో పాటు మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు.
చిలకలూరిపేటలో విడుదల రజినీని గెలిపించుకుని వస్తే మర్రికి ఎమ్మెల్సీ మంత్రి పదవి ఇచ్చి.. క్యాబినెట్లో తన పక్కన కూర్చో పెట్టుకుంటానని జగన్ బహిరంగంగానే చెప్పారు. పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్న జగన్ ఇప్పటివరకు మర్రికి ఎమ్మెల్సీ ఇవ్వలేదు. పైగా ఏ రజనీ కోసం అయితే మర్రి తన సీటు త్యాగం చేశారో… అదే రజనీకి బోనస్గా మంత్రి పదవి కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఎన్నికల చివర ఏడాది క్యాబినెట్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి.
మర్రికి రీసెంట్గా ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ కూడా ఇచ్చేశారు. పైగా రాజధాని జిల్లాలు కృష్ణ, గుంటూరులో కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో మర్రికి మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. ఇప్పటికే కమ్మ సామాజిక వర్గం నుంచి మంత్రిగా ఉన్న కొడాలి నానిని జగన్ తప్పించిన సంగతి తెలిసిందే. తను కమ్మ వర్గానికి వ్యతిరేకం కాదు… అని నిరూపించుకునే క్రమంలో జగన్ మర్రికి మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. పైగా ఎలాగూ తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు అవుతుంది. అయితే చిలకలూరిపేట నుంచి ఇప్పటికే రజిని మంత్రిగా ఉన్నారు. మళ్లీ అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న మర్రికి మంత్రి పదవి సాధ్యం కాదు.
మార్పులు చేర్పుల్లో జగన్ రజనీని తప్పించి మర్రికి మంత్రి పదవి ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. జగన్ ఇప్పటికే రెండుసార్లు క్యాబినెట్లో మార్పులు చేర్పులు చేశారు. ఈసారి ముచ్చటగా మూడోసారి మార్పులు చేర్పుల్లో చాలామందికి ఊహించని షాకులు తప్పవని అంటున్నారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన కౌరు శ్రీనివాస్ తో పాటు కాకినాడ జిల్లా నుంచి మాజీమంత్రి కొరసాల కన్నబాబు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక మర్రి విషయంలో ఏమో గుర్రం ఎగరవచ్చు అన్నట్టుగా లక్చిక్కితే జగన్ ఇచ్చిన మాట నెరవేర్చుకునే అవకాశం ఉంది.