ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసాయి. అలాగే ఉపాధ్యాయులు పట్టభద్రుల నియోజకవర్గాలకు కూడా ఎన్నికలు జరిగాయి. స్థానిక సంస్థల కోటాలోను ఉపాధ్యాయుల కోటాలో జరిగిన ఎన్నికల్లో అధికార వైసిపి విజయం సాధించింది. ఇక పట్టభద్రుల నియోజకవర్గాలకు జరుగుతున్న ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇప్పటికే తూర్పు రాయలసీమ నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్, ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థి వేపాడ చిరంజీవి భారీ మెజార్టీలతో దూసుకుపోతున్నారు.
ఇక పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో నుంచి టిడిపి అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కూడా వైసిపి అభ్యర్థితో హొరా హోరీగా తలపడుతున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీందర్రెడ్డికి టీడీపీ రాంగోపాల్ రెడ్డి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఇక వైసిపి ముందు నుంచి ఉత్తరరాంధ్రలో తమ పార్టీ బలం పెరిగింది అని.. కచ్చితంగా ఉత్తరాంధ్ర పట్టభద్రులు నియోజకవర్గంలో తమ అభ్యర్థి సుధాకర్ గెలుపొందుతారని ధీమాతో ఉంది.
అయితే పట్టభద్రులు మాత్రం అధికార పార్టీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. టీడీపీకి భారీ మెజార్టీతో పట్టం కట్టబోతున్నారు. అనూహ్యంగా పీడీఎఫ్ అభ్యర్థిని రమాప్రభను కూడా వెనక్కి నెట్టేసి భారీ మెజార్టీతో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే పట్టభద్రుల బ్యాలెట్ బాక్స్ లలో పలాస ఎమ్మెల్యే, మంత్రి సీదిరి అప్పలరాజు అవినీతిపై సీఎంకు కొందరు స్లిప్పుల ద్వారా లెటర్ రాసుకున్నారు.
పలాస నియోజకవర్గంలోని పట్టభద్రులు మంత్రి భూకబ్జాలు, అనుచరుల అరాచకాలతో, పాటు మంత్రి అవినీతిపై లెటర్లు రాసి బ్యాలెట్ బాక్స్ లో వేశారు. ఇలాంటి అవినీతిపరుడైన మంత్రి మాకొద్దు అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖలు రాయటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇవి ఎవరు ? రాశారు ఏంటన్న దానిపై క్లారిటీ అయితే లేదు.