ఎమ్మెల్సీ కోటాలో టీడిపి అభ్యర్థి అనురాధ గెలుపు వెనక ఏం జరిగిందో ? ఒక్కొక్క విషయాలు బయటకు వస్తున్నాయి. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్ తమ పార్టీ ఎమ్మెల్యేలలో ఏ ఒక్క ఎమ్మెల్యే చేజారిపోకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. బాగా అనుమానం ఉన్న ఎమ్మెల్యేలను స్వయంగా తన దగ్గరకు పిలిపించుకొని మాట్లాడారు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం ఎన్నికలు పోలింగ్ ప్రారంభం కావటానికి కొద్ది నిమిషాల ముందు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితో పాటు ఆమె భర్తను జగన్ తన వద్దకు పిలిపించుకున్నారట.
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మరికొద్ది నిమిషాలలో ప్రారంభం అయ్యే సమయానికి ముందే ఈ సంఘటన జరిగిందని వైసీపీ వర్గాల నుంచి సమాచారం బయటకు పొక్కింది. జగన్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని సూచించగా శ్రీదేవి తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వాలని అడిగినట్టు అయితే తెలుస్తోంది. ఈ క్రమంలోనే శ్రీదేవి వచ్చే ఎన్నికలలోను తాడికొండ సీటు తనకే ఇస్తానని.. హామీ ఇవ్వాలని కాస్త గట్టిగానే పట్టుబట్టారట.
అయితే జగన్ కాస్త అసహనంగా సీటు సంగతి తర్వాత చూద్దాం.. ముందు పార్టీ అభ్యర్థికి ఓటు వెయ్యి అని చెప్పడంతో శ్రీదేవి కాస్త నొచ్చుకున్నారని తెలిసింది. ఇప్పటికే శ్రీదేవి నియోజకవర్గంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ తో పాటు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ లాంటి నేతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు రాజధాని మార్పు కూడా ఆమెకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో తన టిక్కెట్ పై జగన్ హామీ ఇవ్వకపోవడం ఆమెను బాధపెట్టిందని తెలుస్తోంది. అయితే శ్రీదేవి మాత్రం తాను క్రాస్ ఓటింగ్ చేయలేదని.. కేవలం ఒక దళిత మహిళ ఎమ్మెల్యేను కాబట్టే తనను టార్గెట్ చేస్తున్నారని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.