ఏపీలో గత ఎన్నికలలో వైసిపికి ఏకంగా 151 స్థానాల్లో తిరుగులేని విజయాన్ని అందించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సాధారణ మెజార్టీ కాదు అసలు చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో వైసిపి ఘనవిజయం సాధించింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది చరిత్రలో నిలిచిపోయేంత గొప్ప విజయం. ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలతో పాటు 22 ఎంపీ స్థానాలలో వైసిపి జెండా ఎగిరింది. టీడిపి గెలిచిన మూడు ఎంపీ స్థానాల్లో కూడా స్వల్ప తేడాతో మాత్రమే వైసిపి ఓడింది. ఇక ఎన్నికల తర్వాత టీడిపి నుంచి నలుగురు, జనసేన నుంచి ఒక ఎమ్మెల్యే కూడా వైసిపి చెంత చేరిపోవడంతో ఇప్పుడు అసెంబ్లీలో వైసిపి బలం 156 వరకు చేరుకుంది.
అయితే తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసినందుకు నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక వైసిపి ఆవిర్భావం నుంచి కొన్ని నియోజకవర్గాలు ఆ పార్టీ కంచుకోటలుగా ఉంటూ వస్తున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ గత 20 – 25 ఏళ్లుగా గెలవని నియోజకవర్గాలు కూడా చాలానే ఉన్నాయి. జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం జెండా ఎగరని నియోజకవర్గాలలో టీడిపి ఇప్పుడు అనూహ్యంగా పుంజుకుంటుంది.
వైసిపిపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యతిరేకతకు తోడు.. స్థానికంగా ఆయా నియోజకవర్గాలలో ఉన్న వైసిపి ఎమ్మెల్యేలు లేదా నేతల తీరుతో ఇప్పుడిప్పుడే టీడిపికి అక్కడ ఆశలు చిగురిస్తున్న పరిస్థితి. అనూహ్యంగా ఈ లిస్టులో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డోన్ – ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం నియోజకవర్గాలు ఉండటం తెలుగుదేశంకు సైతం పెద్ద షాకింగ్ గా మారింది. అసలు ఈ రెండు చోట్ల టీడిపికి గెలుస్తామన్న ఆశలు ముందు నుంచి లేవు. ఈ రెండు నియోజకవర్గాలకు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ ప్రాథినిత్యం వహిస్తున్నారు.
ఓవైపు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వై నాట్ 175 అన్న నినాదంతో ముందుకు వెళుతున్నారు. కానీ పార్టీ కంచుకోటలు.. అందులోను మంత్రులు ప్రాథినిత్యం వహిస్తున్న చోట్ల టీడిపి స్వల్ప ఆధిక్యంలోకి రావడం నిజంగానే వైసిపి వర్గాలకు మింగుడు పడని పరిస్థితి అని చెప్పాలి. డోన్ లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందర్ నాథ్ రెడ్డి గత రెండు ఎన్నికల్లోను వైసిపి నుంచి భారీ మెజార్టీతో విజయం సాధిస్తున్నారు. 2009లోనూ ఇక్కడ టీడిపి విజయం సాధించింది. అలాంటి చోట్ల గత రెండు ఎన్నికలలో వైసీపీ జెండా ఎగిరింది.
ఈసారి టీడిపి ఇన్చార్జిగా ధర్మవరం సుబ్బారెడ్డి బాధ్యతలు తీసుకుని.. నియోజకవర్గంలో టీడిపిని పరుగులు పెట్టిస్తున్నారు. చివరకు మంత్రి బుగ్గన సొంత మున్సిపాలిటీ బేతంచర్లలోను టీడిపి సత్తా చాటుకుంది. బుగ్గన సొంత వార్డులో కూడా వైసిపి ఓడిపోయి టీడిపి గెలిచింది అంటే సుబ్బారెడ్డి ఎంత ?పోటీ ఇస్తున్నారో తెలుస్తోంది. అలాగే వైసిపి కంచుకోట.. మరో మంత్రి ఆది మూలపు సురేష్ ఎమ్మెల్యేగా ఉన్న ఎర్రగొండపాలెంలో గత మూడు ఎన్నికలలోను టీడిపి వరుసగా ఓడిపోతూ వస్తోంది. 2014, 2019 ఎన్నికలలో ఇక్కడ నుంచి టీడిపి భారీ మెజార్టీతో ఓడిపోయింది.
అలాంటి చోట గూడూరు ఎరిక్షన్ బాబుకి పార్టీ పగ్గాలు ఇవ్వగా ఆయన దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఎరిక్షన్ బాబు నియోజకవర్గంలో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో పార్టీ కేడర్ కు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. తాజా సర్వేలతోపాటు పొలిటికల్ విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ రెండు నియోజకవర్గాల్లోనూ టీడిపి స్వల్ప ఆధిత్యంలో అయితే ఉంది. ఇదే జోరును వచ్చే ఎన్నికల వరకు కొనసాగిస్తే ఈ రెండు చోట్ల టీడిపి జెండా ఎగరటం కాయంగా కనిపిస్తోంది.