ఏపీలో అధికార వైసిపిలో తీవ్రమైన అసమ్మతి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి జగన్ కు మధ్య సరైన సంబంధాలు లేవు. జగన్ పూర్తిగా సలహాదారుల మీద.. లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఆధారపడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవటం కుదరటం లేదు. తమ సాధక బాధకాలు లేదా నియోజకవర్గంలో సమస్యలు, ఇతర అభివృద్ధి పనులు ముఖ్యమంత్రికి చెప్పుకోవాలంటే ఆ ఛాన్స్ లేదు. ముందుగా సజ్జల రామకృష్ణారెడ్డిని మాత్రమే కలవాలి.
వైసిపికి ఉన్న 151 మంది ఎమ్మెల్యేలు, 40 కి పైగా ఎమ్మెల్సీలు, 30కు పైగా ఎంపీలలో జగన్ ను నేరుగా కలిసే వాళ్ళ సంఖ్య వేళ్ళ మీద లెక్కపెట్టేయవచ్చు. మిగిలిన వాళ్ళు ఎంత పెద్ద నేతలు అయినా సజ్జలను కలిస్తే గొప్ప. ఇంకా చెప్పాలంటే చాలామందికి సజ్జల రామకృష్ణారెడ్డి దర్శనం కూడా దొరకని పరిస్థితి. ఇప్పటికే వైసిపి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటిపోయింది.
మరో ఏడాదిలో సాధారణ ఎన్నికలు ఉన్నాయి. చివరి ఆరు నెలల్లో ఏ ఎమ్మెల్యే చేసే అభివృద్ధి పనులు ఏమీ ఉండవు. అంటే ఎమ్మెల్యేలు పనులు చేసేందుకు కేవలం మరో 6 నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు హామీ ఇచ్చినవి చాలా పనులు ఇంకా పెండింగ్లో ఉండిపోయాయి. కేవలం జగన్ ప్రభుత్వపరంగా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే తప్ప.. అభివృద్ధి అన్నది ఎక్కడా కనపడటం లేదన్న విమర్శలు ఉన్నాయి.
ఈ లెక్కన చూస్తే ఎమ్మెల్యేలు రేపు నియోజకవర్గాల్లోకి వెళ్లి ప్రజలకు ఎలా తమ ముఖం చూపించాలా ? అని మదన పడుతున్నారు. అందుకే ఎమ్మెల్యేలు క్రమక్రమంగా అసమ్మతి గళం వినిపిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలలో నలుగురు తమ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇక జగన్ క్యాబినెట్లో ప్రస్తుతం కొనసాగుతున్న మంత్రులు, మాజీ మంత్రులు కూడా బయటకు వస్తారని తెలుస్తోంది.
ఈ జాబితాలో ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కచ్చితంగా ఆయన వచ్చే ఎన్నికలలో వైసిపి నుంచి పోటీ చేయరని.. అయితే జనసేన లేదా టీడిపి వైపు ఆయన చూస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రి పదవులు పోగొట్టుకున్న మరో ఇద్దరు మంత్రులు కూడా ఎప్పుడైనా వైసిపి నుంచి జంప్ చేస్తారని తెలుస్తోంది.