ఏపీలో అధికార వైసిపి గత ఎన్నికలలో తిరుగులేని మెజార్టీతో విజయం సాధించటంలో నెల్లూరు జిల్లా కూడా కీలక పాత్ర పోషించింది. ఈ జిల్లాలోని 10 అసెంబ్లీ సీట్లతో పాటు నెల్లూరు ఎంపీ సీటును వైసిపి భారీ మెజార్టీతో గెలుచుకుంది. అంటే వైసిపి గత ఎన్నికలలో జిల్లాలో ఒక్క సీటు కూడా ఓడిపోలేదు. ఆ మాటకు వస్తే పార్టీ ఓడిపోయిన 2014 ఎన్నికలలోను జిల్లాలో వైసిపి ఏకంగా ఏడు అసెంబ్లీ సీట్లతో పాటు నెల్లూరు ఎంపీ సీటును గెలుచుకుంది. టీడిపి ఆ ఎన్నికలలో గెలిచిన ఉదయగిరి, వెంకటగిరి, కొవ్వూరు మూడు చోట్ల స్వల్ప మెజార్టీతో మాత్రమే బయటపడింది.
నెల్లూరు జిల్లా ముందు నుంచి వైసీపీకి కంచుకోటగా ఉంటూ వస్తుంది. జగన్ పార్టీ పెట్టిన వెంటనే జరిగిన నెల్లూరు లోక్సభ ఉప ఎన్నికలలో మేకపాటి రాజమొహన్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. అలాగే ఉదయగిరి, కోవూరు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలోను వైసీపీయే విజయం సాధించింది. అలాంటి కంచుకోట నుంచి ఈరోజు వైసిపి పతనం ప్రారంభమైనట్టుగా కనిపిస్తోంది.
ఇప్పటికే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పార్టీకి దూరమయ్యారు. వీరిద్దరూ టీడిపిలో చేరటం ఖరారు అయినట్టే. ఇక తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కూడా టీడిపికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేశారని వైసీపీ వాళ్ళే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలే కాదు.. మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలపై కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావుకు వచ్చే ఎన్నికలలో సీటు లేదని వైసిపి వాళ్ళే చెప్తున్నారు. ఆయన కూడా ఒకటి రెండు నెలల్లో సంచలన నిర్ణయం తీసుకుంటారని జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అలాగే ఇదే జిల్లాలో మరో ఒకరిద్దరు ఎమ్మెల్యేలను కూడా నమ్మే పరిస్థితి లేదని అంటున్నారు. ఏది ఏమైనా కంచుకోట లాంటి నెల్లూరు జిల్లా నుంచి వైసీపీలో పెద్ద తిరుగుబాటు ప్రారంభమైందని చెప్పాలి.