అందరూ శ్రీ వైష్ణవులే.. బుట్టలో రొయ్యలే మాయం.. ఈ సామెత ఇప్పుడు ఏపీలో అధికార వైసిపి ఎమ్మెల్యేలలో క్రాస్ ఓటింగ్ చేసిన వారికి బాగా వర్తిస్తుంది. అధికార పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేశారు. ఈ నలుగురులో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేల విషయంలో ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరు దాదాపు వైసీపీకి దూరం అయ్యారు.
వచ్చే ఎన్నికలలో వీరు టిడిపి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే వీరిద్దరూ టిడిపికి ఓటు వేసి ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేల విషయానికి వస్తే ఎవరు ? టిడిపికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేశారు అన్నదానిపై చాలామంది ఎమ్మెల్యేలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఎవరికివారు తాము మాత్రం ప్రమాణ పూర్వకంగా టిడిపికి ఓటు వేయలేదని చెబుతున్నారు. దీంతో అసలు క్రాస్ ఓటింగ్కు పాల్పడిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు అంతుపడటం లేదు.
ముందు నుంచి తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారని ప్రచారం జరిగింది. అయితే తాను పార్టీకి ఎప్పుడు విధేయతతో ఉన్నానని.. తన నియోజకవర్గంలో రాజధాని మార్పుతో పాటు మరో వ్యక్తికి ఇంచార్జ్ ఇవ్వడంతో సహజంగానే తనపై అనుమానాలు వస్తున్నాయని.. అయితే తాను క్రాస్ ఓటింగ్కు పాల్పడలేదని.. ఒక దళిత మహిళ ఎమ్మెల్యే కావడంతో తనపై కావాలని ఆరోపణలు చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు.
అలాగే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఆయనపై కూడా సందేహాలు వ్యక్తం అయ్యాయి. అయితే తన ప్రథమ ప్రాధాన్యత ఓటు జయ మంగళ వెంకటరమణకు, రెండో ప్రాధాన్యత మర్రి రాజశేఖర్ కు, మూడో ప్రాధాన్యత పోతుల సునీతకు వేశానని తాను నూటికి 500% క్రాస్ ఓటింగ్కు పాల్పడలేదని క్లారిటీ ఇచ్చేశారు. అలాగే ముందుగా ఫలితాలు వెలువబడిన వెంటనే విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పై సందేహాలు వచ్చినా.. ఆ తర్వాత ఆయన క్రాస్ ఓటింగ్కు పాల్పడలేదని క్లారిటీ వచ్చింది.
ఇక అనూహ్యంగా నెల్లూరు జిల్లా నుంచి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారంటూ కొత్త సందేహాలు బయటకు వస్తున్నాయి. అయితే ఆయన దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో చాలామంది ఆయనను కూడా అనుమానిస్తున్నారు. ఏదేమైనా క్రాస్ ఓటింగ్ జరిగిన మాట వాస్తవం. అయితే వైసిపి ఎమ్మెల్యేలు ఎవరు తాము క్రాస్ ఓటింగ్కు పాల్పడలేదని చెబుతున్నారు. దీనిని బట్టి చూస్తే అందరూ శ్రీ వైష్ణవులే… మరి బుట్టలో రొయ్యలే ఎలా ? మాయం అయ్యాయ్ అన్నది ఎవరికీ అంతుపడటం లేదు. మరి దీనిపై వైసీపీ అంతర్గతంగా పోస్టుమార్టం చేసి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను ఎలా ? పట్టుకుంటుందో చూడాలి.