ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఇది సంధి సమయం. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు వ్యూహా లు పన్నుతున్న సమయంలో.. వ్యూహాలను పటాపంచలు చేస్తూ.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుండడం.. వేళ్లన్నీ.. ఎంపీ అవినాష్రెడ్డి వైపు చూపిస్తుండడం, మరోవైపు.. అవినాష్ తండ్రి భాస్కరరెడ్డిని ఇప్పటికే అరెస్టు చేసిన క్రమంలో వైసీపీ నిజంగానే ఒక గందరగోళ వాతావరణంలో ఉందని అంటున్నారు పరిశీలకులు.
మరి ఇలాంటి పరిస్థితిలో.. అసలు కీలకమైన నాయకుడు.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత.. `ఆయన గుండె పోటుతో ఈ ఉదయం స్వగృహంలో కన్నమూశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని వైసీపీ కుటుంబం పక్షాన మేం కోరుకుంటున్నాం` అని ప్రకటించిన పార్టీ ప్రధాన కార్యదర్శి వి. విజయ సాయి రెడ్డి ఏమయ్యారా? అనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. నాడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో స్పందించిన సాయి.. గురించి అనేక వార్తలు వచ్చాయి.
అయితే.. ఇప్పుడు ఒకవైపు అవినాష్రెడ్డి ఈ విషయంలో తమకు సంబంధం లేదని.. తమ ప్రమేయం లేదని..దస్తగిరి భారతికి, సీబీఐకి అమ్ముడు పోయారని.. పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు.. సీఎం జగన్ సైతం.. ఈ విషయంలో అవినాష్ సహా.. వైఎస్ ఫ్యామిలీని ఏదో ఒక రకంగా ఒడ్డుకు చేర్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. మరి కనీసం.. మీడియా ముందుకు రాకపోయినా.. వివేకానందరెడ్డి.. జగన్కు ఒకప్పుడు కుడిభుజంగా ఉన్న ఈ నేత ఇప్పుడు తోడుగా ఉండాలి కదా.. అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి.
అసలు సాయిరెడ్డి ఆచూకీ కూడా తెలియడం లేదు. ఈ పరిణామాలను బట్టి.. అసలు ఆయన ఏం చేస్తున్నారు? మనకెందుకులే అనుకున్నారా? లేక.. ఈ విషయాల్లో తాను వేలు పెట్టి చేసేది ఏముంటుందని భావిస్తున్నారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఏదేమైనా కీలక సమయంలో విజయసాయి లేకపోవడం నిజంగానే లోటుగా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.