ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన అభినందనలు చెప్పేవారు పెరుగుతున్నారు. గత ఏడాదికి ఇప్పటికీ.. అనేక సంఖ్యలో ఈ శుభాకాంక్షల సంఖ్య పెరిగింది. ఇదిలా వుంటే.. అసలు చంద్రబాబు రాజకీయాల్లోకి రాకుండా ఉంటే.. అనే ప్రశ్న తరచుగా వినిపిస్తూ ఉంటుంది. నిజమే.. ఈ విషయాన్ని చంద్రబాబు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో తన ఆలోచనలన్నీ.. కూడా ప్రజాసేవ వైపు ఉండేవన్నారు.
ఈ క్రమంలోనే తాను సివిల్స్ రాసి.. కలెక్టర్ కావాలని భావించినట్టు తెలిపారు. దీనికి సంబంధించి శిక్షణ కోసం.. తాను.. ఒక సందర్భంలో ఢిల్లీకి కూడా వెళ్లి వచ్చానన్నారు. అయితే.. ఇలా సివిల్స్పై అధ్యయనం చేస్తున్న సమయంలోనే.. కలెక్టర్లను సైతం అదుపు చేయగల సత్తా.. ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం రాజకీయాల ద్వారా లభిస్తుందనిప్రత్యక్షంగా తెలుసుకున్నట్టు చెప్పారు.
ఈ ఆలోచనే తనను రాజకీయాల వైపు మళ్లించిందని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి అడుగులు పెట్టాక.. ప్రజల కు సేవ చేయడం చూశాక ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. అదే ఐఏఎస్ అయి ఉంటే.. కేవలం ఒక జిల్లాకో.. ఒక ప్రాంతానికో మాత్రమే పరిమితం అయి.. పనిచేయాల్సి ఉండేదని.. అది కూడా రాజకీయ నేతలు చెప్పినట్టో.. లేక ప్రభుత్వం చెప్పినట్టో చేయాల్సి వచ్చేదని.. అలా కాకుండా.. తాను కూడా రాజకీయాల్లోకి వెళ్తే..త న ఆలోచనల మేరకు.. ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కేదని వివరించారు.
అందుకే తాను ఐఏఎస్ కావాలని అనుకుని కూడా.. రాజకీయాలవైపు వచ్చినట్టు చంద్రబాబు చెప్పారు. రాజకీయాల్లో అనేక మందితో చంద్రబాబు కలిసి పనిచేశారు. చంద్రగిరినియోజకవర్గం నుంచి ఒకసారి.. తర్వాత కుప్పం నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు ఓటమెరుగని నాయకుడిగా..చంద్రబాబు గెలుస్తూనే ఉన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా.. ప్రజలు ఆయనను నెత్తిన పెట్టుకుంటూనే ఉన్నారు.