ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో బావాబామ్మర్దుల సవాల్ నడుస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని ఎన్నికల నుంచి తమినేని సీతారాం, కూన రవికుమార్ల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తుంది. వీరిద్దరు స్వయంగా బావాబామ్మర్దులు అవుతారు. అలాగే మరో వరుసలొ మేనమామ, మేనల్లుడు అవుతారు. ఏదైతే ఏముంది..మొత్తానికి ఇద్దరు రాజకీయ శత్రువులుగా తలపడుతున్నారు. అయితే గతంలో తమ్మినేని టిడిపిలొ పనిచేసిన విషయం తెలిసిందే.
1983, 1985, 1994, 1999 ఎన్నికల్లో టిడిపి నుంచే పోటీ చేసి ఆమదాలవలసలో గెలిచారు. ఇక 2004లో ఓడిన ఈయన..2009లో ప్రజారాజ్యంలోకి వెళ్లారు. ఇక బావ వెనుకే రాజకీయం నేర్చుకున్న కూన టిడిపిలోనే ఉండిపోయారు. ఈ క్రమంలోనే 2009లో ప్రజారాజ్యం నుంచి తమ్మినేని, టిడిపి నుంచి కూన పోటీ చేశారు..కానీ ఇద్దరు ఓడిపోయారు. అప్పుడు కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత తమ్మినేని వైసీపీలోకి వెళ్లారు. 2014లో తమ్మినేని వైసీపీ , కూన టిడిపి నుంచి పోటీ చేశారు. విజయం కూనని వరించింది.
2019 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది..విజయం తమ్మినేనిని వరించింది..అలాగే ఆయన స్పీకర్ కూడా అయ్యారు. స్పీకర్ గా ఉంటూ..రాజకీయం చేస్తున్న తొలి నేతగా తమ్మినేని నిలిచారు. ఇక తమ్మినేని వైఖరిని జనం హర్షించలేదనే చెప్పాలి. ఇక ఎమ్మెల్యేగా ఆమదాలవలసలో చేసిన అభివృద్ధి తక్కువే. అటు ఆయన తనయుడు పెత్తనం ఎక్కువైందనే విమర్శలు ఉన్నాయి. దీంతో అక్కడ తమ్మినేనికి కాస్త యాంటీ వస్తుంది. ఈ క్రమంలోనే కూన నిదానంగా బలపడుతూ వస్తున్నారు.
ఇప్పటికే అక్కడ తన బావకు పోటీగా కూన ఎదిగారు. అలాగే తాజాగా నియోజకవర్గంలో కీలకంగా ఉన్న కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్..టీడీపీలో చేరారు. చంద్రబాబు ఆదేశాలతోనే ఇదంతా జరిగింది. దీంతో టిడిపికి కాస్త బలం చేకూరింది. ఇప్పుడు ఆమదాలవలసలో టిడిపికి లీడ్ వచ్చింది. దీంతో నెక్స్ట్ ఎన్నికల్లో బావకు బామ్మర్ది చెక్ పెట్టేలా ఉన్నారు.