టీడీపీ అధినేత చంద్రబాబును తక్కువగా అంచనా వేసిన వారు.. ఇప్పుడు ఆయన చెంతకు పరుగులు పెడుతున్నారా? చంద్రబాబుతో చేతులు కలిపేందుకు ఉవ్విళ్లూరుతున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరూ ఉండరు. ఇదే సూత్రాన్ని అన్ని పార్టీలూ అమలు చేస్తున్నాయి.అ యితే.. చంద్రబాబు విషయానికి వస్తే.. 2019కి ముందు.. ప్రత్యేక హోదా కోసం.. బీజేపీతో ఉన్న నెయ్యాన్ని ఆయన కయ్యంగా మార్చుకున్నారు. దీనిని బీజేపీ పెద్దలు.. జీర్ణించుకోలేక పోయారు. దీంతో ఆయనకు డిస్టెన్స్ పాటించారు.
అయినప్పటికీ.. జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయాలను అవగాహన చేసుకున్న చంద్రబాబు బీజేపీతో చేతులు కలపాలని అనేక సందర్భాల్లో ప్రయత్నాలు చేశారు. కానీ, ఇంటా బాయటా కూడా.. బీజేపీ పెద్దలు ఆయనను తృణీకరించారు. దీంతో బీజేపీతో చేతులు కలపడం.. చంద్రబాబుకు ఇక సాధ్యం కాదనే ధోరణి.. సర్వత్రా వినిపించింది. అయితే.. కీలక సమయాల్లో మాత్రం బీజేపీ కోరకపోయినా.. చంద్రబాబు ఆ పార్టీకి దన్నుగా నిలబడుతున్నారు.
ఇదే అండమాన్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జరిగింది. అధికారానికి ఒక మెట్టు దూరంలో ఉన్న బీజేపీకి చంద్రబాబు అండగా నిలచారు. ఇది.. తొలి అడుగు. తర్వాత జమ్ము కశ్మీర్ విభజన సహా.. అనేక నిర్ణయాల్లోనూ కేంద్రానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం ద్వారా.. చంద్రబాబు తన వైఖరిని చెప్పారు. అయినప్పటికీ.. ఎక్కడా బీజేపీ మనసు కరిగినట్టు కనిపించలేదు.
ఇక, తాజాగా ఏపీలో చోటు చేసుకున్న పరిణామాలు.. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పుంజుకున్న తీరు.. అయిపోయిందని అనుకున్న టీడీపీ లేచి పరుగులు పెట్టడం.. వైసీపీ బలాన్ని తగ్గించడం.. దూకుడు తట్టుకుని నిలబడడం వంటివి టీడీపీ పని అయిపోలేదు.. మరింత యవ్వనంగా ఉందనే సంకేతాలను చంద్రబాబు పంపించారు. ఫలితంగా ఇప్పుడు బీజేపీ.. స్వయంగా టీడీపీ వైపు చూసే పరిస్థితులు చంద్రబాబు కల్పించారనే చెప్పాలి.
ఏపీలోనే కాదు.. తెలంగాణలోనూ టీడీపీ సహకారం కోసం.. బీజేపీ పెద్దలు ప్రయత్నించే సమయం వచ్చింది. ఈ ఏడాది తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి. బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం లేదు. ఉన్నా.. కేవలం నగరాలు.. పట్టణాలకే పరిమితమైంది. ఇలాంటి సమయంలో టీడీపీ వంటి బలమైన పార్టీతో పొత్తు పెట్టుకుని.. అధికారం అనే కలను సాకారం చేసుకునేందుకు బీజేపీకి అవకాశం ఉంటుందని అంటున్నారు. మొత్తంగా చూస్తే.. బీజేపీకి చంద్రబాబు విలువ తెలిసివచ్చింది.. తమ్ముళ్లూ బేఫికర్! అనే కామెంట్లు వస్తున్నాయి.