వచ్చే ఎన్నికల్లో గెలుపు దిశగా టిడిపి వెళుతున్న విషయం తెలిసిందే..వైసీపీకి చెక్ పెట్టి అధికారం దక్కించుకోవాలని టిడిపి కష్టపడుతుంది. ఇప్పటికే వైసీపీకి ధీటుగా టిడిపి బలపడింది. అలాగే గత ఎన్నికల్లో ఓటమి పాలైన నేతలు ఇప్పుడు పికప్ అయ్యారు. ఇక ఇందులో మాజీ మంత్రులు ఊహించని విధంగా పికప్ అయ్యారు.
గత ఎన్నికల్లో మంత్రులుగా పనిచేసిన వారు చాలామంది ఓటమి పాలయ్యారు. కేవలం అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, చినరాజప్ప మాత్రమే గెలిచారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఈ ముగ్గురుతో పాటు మరికొందరు మాజీ మంత్రులు రేసులోకి వచ్చారు. ఈ సారి పక్కాగా గెలిచేలా ఉన్నారు. ఎచ్చెర్లలో కిమిడి కళా వెంకట్రావుకు గెలుపు అవకాశాలు మెరుగుపడ్డాయి. ఇక బొబ్బిలిలో మాజీ మంత్రి సుజయ కృష్ణరంగరావు ఈ సారి పోటీ చేయడం లేదు. కానీ ఆయన తమ్ముడు బేబీ నాయన బరిలో దిగుతున్నారు. అక్కడ టిడిపి పక్కాగా గెలవడం ఖాయమే.
ఇక నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఈ సారి గెలుపు గుర్రం ఎక్కడం ఫిక్స్. ఆచంటలో మరో మాజీ మంత్రి పితాని సత్యనారాయణకు కూడా గెలుపు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొవ్వూరులో కేఎస్ జవహర్ సైతం నిలబడితే గెలిచే ఛాన్స్ ఉంది. అటు మైలవరంలో దేవినేని ఉమా, మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర ఈ సారి గెలుపు దిశగా వెళుతున్నారు.
చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు, వేమూరులో నక్కా ఆనందబాబు, మంగళగిరిలో నారా లోకేష్, పలమనేరులో అమర్నాథ్ రెడ్డి, రాయదుర్గంలో కాల్వ శ్రీనివాసులు..ఇలా మాజీ మంత్రులంతా గెలుపు బాటలో ఉన్నారు. కానీ సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ విషయమే కాస్త డౌట్. ఏదేమైనా గత ఎన్నికల్లో ఓడిన మాజీ మంత్రులు..ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటడం ఖాయం.