ఏపీలో అధికార వైసిపి నుంచి పలువురు ఎమ్మెల్యేలు బయటకు వచ్చేస్తున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. ఇప్పటికే చాలామంది తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఇక ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలోను నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ లైన్ ధిక్కరించి మరి టిడిపికి ఓటు వేశారన్న ఆరోపణతో.. ఆ నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా ఇప్పుడు మరికొందరు కూడా పార్టీ నుంచి బయటికి వచ్చేందుకు రెడీ అవుతున్నట్టు ప్రచారం జరుగుతుంది.
ఈ క్రమంలోనే కొందరు ఎమ్మెల్యేల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పై ఈ తరహా చర్చరాగా ఆయన ఇప్పటికే దీనిని ఖండించారు. అలాగే ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి జగన్కు అనుభవం లేదని చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ఎమ్మెల్యే, మాజీ మంత్రి కూడా పార్టీ మారేందుకు రెడీ అవుతున్నట్టు పుకార్లు షికారులు చేస్తున్నాయి. ఈసారి పార్టీ మారే ఎమ్మెల్యే ఉత్తరాంధ్ర నుంచి కావటం విశేషం. గత ఎన్నికలకు ముందు టిడిపి అనకాపల్లి ఎంపీగా ఉన్న అవంతి శ్రీనివాసరావు ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లారు. గత ఎన్నికలలో భీమిలి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన జగన్ క్యాబినెట్లో మంత్రిగా మూడేళ్లు పనిచేశారు.
ఇక క్యాబినెట్ మార్పులు చేర్పులలో ఆయన మంత్రి పదవి పోయింది. ఇక కొద్ది రోజులుగా ఆయన పార్టీ మార్పు ప్రచారం జరుగుతుంది. దీనిని ఆయన ఖండిస్తున్నా విశాఖ జిల్లాలో మాత్రం ఎన్నికలకు ముందు ఆయన కచ్చితంగా పార్టీ మారిపోతారని అంటున్నారు. అవంతి మాత్రమే కాదని ఉత్తరాంధ్ర నుంచి మరో ఒకరిద్దరు వైసిపి ఎమ్మెల్యేలు కూడా పక్క చూపులు చూస్తున్నట్టు గట్టిగా ప్రచారం నడుస్తోంది.