టీడీపీకి మరోసారి కీలక నేత సాయం లభిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీ టార్గెట్ ఒక్కటే వచ్చే ఎన్నికల్లో ఎన్ని ఇబ్బందులు పడినా అధికారంలోకి రావడమే. వైసీపీ పీచమణిచి అధికార పీఠాన్ని అందుకోవడమే. ఈ క్రమంలో ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలు కూడా అవలంభించాలని టీడీపీ భావిస్తోంది. అయితే.. మరోవైపు.. ఒంటరిగా కాకుండా.. జాతీయస్థాయిలో బలంగా ఉన్న బీజేపీని కలుపుకొని పోవాలని భావిస్తోంది.
అయితే.. పొత్తుల విషయంలో బీజేపీ ఇంకా ఏమీ తేల్చడం లేదు. తాము టీడీపీతో జతకట్టే విషయంలో బీజేపీ పెద్దలు ఎలాంటి సంకేతాలు కూడా ఇవ్వడం లేదు. కానీ, ఏపీలో గత ఎన్నికల్లో బీజేపీ అండతోనే వైసీపీ అధికారంలోకి వచ్చిందని చంద్రబాబు సహా రాజకీయ నాయకులు విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలో తాము ఒంటరిగా వెళ్లడం కంటే.. బీజేపీని తమవైపు తిప్పుకొని పొత్తుతో ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నా రు.
ఈ క్రమంలోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను సైతం చంద్రబాబు రంగంలోకి దింపారనే వాదన కొన్నాళ్లుగా వినిపిస్తోంది. ఈ క్రమంలో పవన్ కూడా అనేక సందర్భాల్లో కేంద్రంతో చర్చలు జరిపారు. ఇటీవల కూడా ఆయన బీజేపీతో చర్చించారని తెలిసింది. అయితే..ఇప్పటి వరకు కూడా బీజేపీ నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ అసలు టీడీపీతో పొత్తులకు రెడీగా ఉందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలో తాజాగా టీడీపీ తన ఫోకస్ను మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వైపు తిప్పినట్టు తెలుస్తోంది. ఆయన ద్వారా కాగల కార్యాన్ని నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా వెంకయ్య నాయుడు శ్రీకాకుళంలో పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఆయనతో చర్చలు కూడా జరిపారు.
దీనిని బట్టి పొత్తుల విషయంలో వెంకయ్య సాయాన్ని టీడీపీ కోరుతున్న సంకేతాలు వస్తున్నాయి. గతంలో 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకునే విషయంలో వెంకయ్య అన్నీతానై వ్యవహరించారు. ఇప్పుడు కూడా అదే పనిచేసే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. వెంకయ్య జోక్యం చేసుకుంటే.. టీడీపీకి తిరుగు ఉండదని.. పెద్దలు సైతం దిగి వస్తారని భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.