మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైసిపి బంధం తెగిపోయింది. నెల్లూరు జిల్లాలో ఏకంగా నాలుగు దశాబ్దాల పాటు రాజకీయం అనుభవం ఉన్న నేతగా ఆనం రామనారాయణ రెడ్డికి పేరు ఉంది. ఆనం సోదరులలో చిన్నవాడు అయినా రామనారాయణరెడ్డి ఆలోచనపరుడిగా, వ్యూహకర్తగా.. సాత్విక నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఆర్థిక మంత్రిగా సమర్థవంతంగా తన బాధ్యతలు నిర్వహించారు. ఆనం 1983లో ఎన్టీఆర్ పిలుపుమేరకు టీడిపి తీర్థం పుచ్చుకున్నారు.
అప్పటి రాపూరు నియోజకవర్గం నుంచి తొలిసారిగా టీడిపి టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత టీడిపి నేతలతో ఆయనకు గ్యాప్ రావడంతో ఆనం కుటుంబం కాంగ్రెస్లోకి జంప్ చేసింది. కాంగ్రెస్ నుంచి ఆత్మకూరులో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. ఇక 2014 ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆనం ఆత్మకూరులో ఓడిపోయారు. ఆ తర్వాత ఆనం టీడిపిలోకి రాగా ఆయను ఆత్మకూరు టీడిపి ఇన్చార్జిగా నియమించారు.
అయితే ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆయన వైసిపిలోకి వెళ్లిపోవడంతో జగన్ వెంకటగిరి సీటు ఇచ్చారు. వెంకటగిరిలో గత ఎన్నికలలో ఆనం ఏకంగా 70 వేల ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఆనం టీడిపిలో ఉన్నప్పుడు మంత్రి పదవి ఆశించారు. అయితే ఎన్నికల తర్వాత పార్టీ మారిన నేత కావడంతో చంద్రబాబు అందుకు ఇష్టపడలేదు. వైసిపిలో ఆయన సీనియార్టీకి ఏమాత్రం గౌరవం ఇవ్వలేదు. టీడిపి, చంద్రబాబు చాలా బెటర్ అని… వైసీపీలో సీనియర్ నేతలకు తగిన గౌరవం లభించదన్న విషయం వైసిపిలో ఎమ్మెల్యేగా గెలిచాక కానీ ఆయనకు అర్థం కాలేదు అని అనుచరులు చెబుతున్నారు.
ఇక ఇప్పుడు ఆనం తిరిగి టీడిపి లోకి ఎంటర్ అవ్వటం దాదాపు ఖరారు అయింది. వచ్చే ఎన్నికలలో ఆనం జిల్లాలో రెండు టిక్కెట్లు అడుగుతున్నట్టు తెలుస్తోంది. ఆత్మకూరు నుంచి తన కుమార్తె కైవల్యా రెడ్డి పోటీ చేస్తారని.. నెల్లూరు సిటీలో తాను రంగంలో ఉంటానని.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను ఓడించడమే తన లక్ష్యం అని ఆనం శపథం చేస్తున్నట్టు తెలుస్తోంది. కైవల్యా రెడ్డి బద్వేల్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే కునిరెడ్డి విజయమ్మకు స్వయానా కోడలు.
అసలు అనిల్ కుమార్ మంత్రి అయ్యాకే ఆనంను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారని ఆనంకు తీవ్రమైన కోపం ఉంది. ఈ క్రమంలోనే ఈసారి నెల్లూరు సిటీలో అనిల్ ను చిత్తుచిత్తుగా ఓడించాలని ఆనం గట్టిగా ట్రై చేస్తున్నారట. ఒకవేళ అలా కుదరని పక్షంలో కోటంరెడ్డి కూడా సిటీ నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. అప్పుడు ఆనం నెల్లూరు రూరల్ నుంచి అయినా పోటీ చేయవచ్చని తెలుస్తోంది. ఇక 2009 ఎన్నికలలో ఆనం సోదరుడు ఆనం వివేక నెల్లూరు రూరల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఏదేమైనా నెల్లూరు జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో ఆనంకు బలమైన అనుచరుగడం ఉంది. ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లడం వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి.