ఆ నియోజకవర్గ ఉన్నది ఏపీలో అయినా.. రెండు తెలుగు రాష్ట్రాలలోనే ఆ ఎన్నిక ఫలితం ఎంతో ఆసక్తి రేపుతుంది. రాయలసీమలోనే రెండు ప్రధాన సామాజిక వర్గాలు అయిన కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల మధ్య హోరాహోరీ పోరు జరిగే నియోజకవర్గం అది. గత రెండు ఎన్నికలలోను అక్కడ వైసిపి నుంచి ఆ పార్టీ కీలక నేత గెలిస్తూ వస్తున్నారు. అయితే ఈసారి ఆ కీలక నేత జోరుకు బ్రేక్ పడనుందా? ఈసారి ఆ నియోజకవర్గంపై టిడిపి జెండా ఎగరనుందా? ఇదే ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ఆ నియోజకవర్గం ఏదో కాదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి. గత రెండు ఎన్నికలలో ఇక్కడి నుంచి వైసీపీ తరఫున సీనియర్ సినీనటి, ప్రస్తుత మంత్రి ఆర్కే రోజా స్వల్ప మెజార్టీతో విజయాలు సాధిస్తూ వస్తున్నారు. ఒకప్పుడు పుత్తూరును తన అడ్డాగా చేసుకున్న సీనియర్ టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు 2009లో ఆ నియోజకవర్గం రద్దు కావడంతో నగరికి మారారు. ఆ ఎన్నికలలో 1300 ఓట్ల తేడాతో గెలిచిన ముద్దుకృష్ణమ నాయుడు 2014 ఎన్నికలలో పార్టీ అధికారంలోకి వచ్చినా రోజాపై కేవలం 800 పట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు.
ఇక 2019 ఎన్నికలలో ఆయన పెద్ద కుమారుడు గాలి భాను ప్రకాష్ పోటీ చేసి మరోసారి 2600 స్వల్ప తేడాతో ఓడిపోవలసి వచ్చింది. ఆ నియోజకవర్గంలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంచి పేరు ఉన్న గాలి కుటుంబం నుంచి తండ్రి కొడుకులు ఇద్దరు రోజా చేతిలో అతి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం రోజా మంత్రిగా కూడా ఉన్నారు. అయితే నియోజకవర్గంలో రోజాపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. సాధారణ ప్రజల నుంచి మాత్రమే కాదు.. ఆ పార్టీ నేతలు కూడా అక్కడ రెండు, మూడు గ్రూపులుగా విడిపోయారు. వచ్చే ఎన్నికలలో రోజాకు టిక్కెట్ ఇస్తే తాము సహకరించే పరిస్థితి లేదని.. కూడా కుండ బద్దలు కొట్టేస్తున్నారు.
దీనికి తోడు చిత్తూరు జిల్లాకే చెందిన మంత్రి, ఆ పార్టీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం రోజాకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని రోజా కూడా ఎప్పుడూ అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇక రోజా పరిస్థితి ఇలా ఉంటే.. ఇప్పటి వరకు వెల్లడి అవుతోన్న అన్నీ సర్వేల్లోనూ గాలి భానుప్రకాష్ నాయుడు కనీసం 10 వేల ఓట్ల భారీ ఆధిక్యంతో ఉన్నారు. ఇప్పుడే ట్రెండ్స్ ఇలా ఉంటే ఎన్నికల వేళ ఖచ్చితంగా భానుప్రకాష్ నాయుడు మరింత భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.