టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్బాబు ఈ రోజు తీవ్ర అనారోగ్యంతో మృతిచెందారు. గత కొంత కాలంగానే ఆయన పలు సమస్యలతో బాధపడుతున్నారు. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ కావడంతో ఈ రోజు శరత్బాబు హైదరాబాద్లోని ఏఐజీ హాస్పటల్లో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు. ఇక శరత్బాబు స్వస్థలం ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస. ఆయన 1951 జూలై 13న ఆముదాలవలసలనే జన్మించారు.
సినిమా రంగంపై ఆసక్తితో సినిమాల్లోకి వచ్చారు. ఆయన మాతృభాష తెలుగులోనే కాదు తమిళం, కన్నడం, మళయాళంలోనూ సినిమాలు చేశారు. ఇంకా చెప్పాలి అంటే ఆయన తెలుగు కంటే తమిళంలోనే ఎక్కువ ఆదరణ పొందారు. ఆయన అసలు పేరు సత్యంబాబు దీక్షితులు. పవన్ కళ్యాణ్ నటించిన వకీల్సాబ్ సినిమాలోనూ గెస్ట్ పాత్రలో చేసిన ఆయన చివరి సినిమా మళ్లీపెళ్లి.
శరత్బాబు తండ్రికి పెద్ద హోటల్ ఉండేది. తనలాగే వ్యాపారంలోకి వస్తాడని తండ్రి ఆశించేవారు. అయితే ఆయనకు పోలీస్ ఆఫీసర్ కావాలన్న కోరిక ఉండేది. అయితే నువ్వు హీరోలా ఉంటావు.. సినిమాల్లో ప్రయత్నించమని మిత్రుల ప్రోత్సాహంతో తండ్రికి ఇష్టంలేకపోయినా.. తల్లి ప్రోత్సాహంతో శరత్బాబు చెన్నై వచ్చి సినిమాల్లో ట్రై చేశారు. ఆయన తొలి చిత్రం రామరాజ్యం. అప్పటికే ఎంతో పేరున్న చంద్రకళ ఇందులో హీరోయిన్.
ఆ సినిమాకే ఆయన పేరు మార్చుకున్నారు. అప్పటికే పాపులర్ కమెడియన్గా ఉన్న రమాప్రభతో పరిచయం ప్రేమగా మారి వారు పెళ్లి చేసుకున్నారు. వయస్సులో ఆమె శరత్బాబు కంటే పెద్ద. ఆ తర్వాత కొన్నాళ్లు కాపురం చేశాక మనస్పర్తల నేపథ్యంలో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ తమిళ నటుడు నంబియార్ కూతురు స్నేహను వివాహం చేసుకున్న శరత్బాబు ఆమెకు కూడా విడాకులు ఇచ్చేశాడు.
ఆ తర్వాత ముద్దుగుమ్మ నమితతో శరత్బాబు ప్రేమాయణం నడిపాడని.. ఆమెను కూడా మూడో పెళ్లి చేసుకున్నాడని పుకార్లు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఇవన్నీ రూమర్లు అని తేలిపోయింది. ఏదేమైనా శరత్బాబు ఎంతో గొప్ప విలక్షణ నటుడు. ఆయన మృతికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.