వైసిపి నుంచి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సస్పెండ్ కు గురయ్యారు. దీంతో ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికలలో వైసిపి తరఫున ఎవరు పోటీ చేస్తారు ? ఆ కొత్త నేతగా ఎవరు వస్తారు అన్న ఆసక్తి సహజంగానే ఉంది. అయితే పార్టీ అధినేత జగన్ ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నా ఇప్పటికే ఉదయగిరి వైసిపి అభ్యర్థి విషయంలో రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. కావలి మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి తో పాటు, ప్రముఖ పారిశ్రామికవేత్త కావ్య కృష్ణారెడ్డి, చిరంజీవి రెడ్డి లాంటివారు తమకు ఇంచార్జ్ వస్తుందని ఆశలు పెట్టుకున్నారు.
ఇక ఉదయగిరి నియోజకవర్గంలో మెట్టుకూరు ధనుంజయ రెడ్డి పరిశీలకులుగా నియమితులు అయ్యారు. అయితే ఇప్పుడు వీరు ఎవరిని కాదని.. ఒక మహిళ నేతకు జగన్ వచ్చే ఎన్నికలలో సీటు ఇవ్వబోతున్నారంటూ నియోజకవర్గంలో ఇప్పటికే జోరుగా ప్రచారం ప్రారంభమైంది. ఉదయగిరి ఎమ్మెల్యే టిక్కెట్టు ఆమెదే అంటూ నెల్లూరు రాజకీయాల్లో హాట్ హాట్ చర్చలు కూడా నడుస్తున్నాయి. ఆమె ఎవరో కాదు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
వైసిపి రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డి. ఇప్పటికే వేమిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. నెల్లూరు జిల్లాలో తన ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి కుటుంబం పేరు అందరికీ సుపరిచితమే. వివాదాలకు దూరంగా అందరిని కలుపుకుపోయే నేతగా ఆయనకు మంచి పేరు ఉంది. ఈ క్రమంలోనే ఆర్థిక అంగ బలాల నేపథ్యంలో ప్రశాంతి రెడ్డిని వచ్చే ఎన్నికల బరిలో దింపాలని జగన్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. పైగా జిల్లాలో మహిళా ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. ప్రశాంత్ రెడ్డికి టికెట్ ఇస్తే.. ఆ కోటా కూడా పూర్తి చేసినట్టు అవుతుందని జగన్ భావిస్తున్నారు.
ప్రశాంతి రెడ్డికి సీటు ఇస్తే మేకపాటి వర్గంలో ఉన్నవారు కూడా పార్టీ వైపు మొగ్గు చూపుతారని జగన్ ప్లాన్. ఇక ఈ నియోజకవర్గంలో టీడిపి 1999, 2014లో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం టీడిపి తరఫున కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు ఇన్చార్జిగా ఉన్నారు. అయితే ఈసారి చంద్రబాబు రెడ్డి సామాజిక వర్గానికి సీటు ఇస్తే ఎలా ? ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ ప్రశాంతి రెడ్డి అయితేనే బలమైన అభ్యర్థి అవుతారని ఆమె వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.