టాలీవుడ్ లో నటశేఖర కృష్ణ ప్రస్థానం కొద్ది నెలల క్రితం ముగిసింది. తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న మాస్ హీరో కచ్చితంగా కృష్ణ అని చెప్పాలి. ఆయన నిర్మాతల హీరో.. ఆయనతో సినిమాలు తీసిన నిర్మాతలు ఎవరైనా నష్టపోతే ఏం ఆలోచించకుండా వెంటనే తన కాల్ షీట్లు ఫ్రీగా ఇచ్చేవారట. అందుకే ఆయన తన కెరీర్లో వందల సినిమాల్లో నటించినా కూడా ఆయన సంపాదించుకున్న ఆస్తులు ఏమి పెద్దగా లేవు. ఇందుకు ప్రధాన కారణం ఆయనకు ఉన్న మానవతా దృక్పథం అని చెప్పాలి.
తన వల్ల సినిమాలు తీసిన నిర్మాతలు కష్టాల్లో ఉంటే కృష్ణ వెంటనే జాలిగుణంతో వాళ్లకు ఉచితంగా కాల్షీట్లు ఇచ్చి సినిమాలు చేసి పెట్టేవారు. ఇదిలా ఉంటే కృష్ణ ఎక్కువగా విజయనిర్మల, జయప్రద, శ్రీదేవి ఆ తర్వాత విజయశాంతితో సినిమాలు చేశారు. ఏ హీరోయిన్ ను అయినా కృష్ణ ఇష్టపడి ఆమెతో సినిమాలు చేయాలని అనుకుంటే వెంటనే నిర్మాతలకు చెప్పి ఆ హీరోయిన్ డేట్లు బ్లాక్ చేయించేవారట.
విజయనిర్మల లేదా జయప్రద, శ్రీదేవి అయినా సరే ఏ హీరోయిన్తో అయినా ఆయన సినిమా చేయాలని మనస్పూర్తిగా ఇష్టపడితే.. ముందుగా డేట్లు బ్లాక్ చేయించి ఆ తర్వాత కథ, దర్శకులతో చర్చించి ఆ హీరోయిన్ నే తన సినిమాలో పెట్టుకునే వారిని అప్పట్లో ప్రచారం బాగా జరిగింది. కృష్ణ తన కెరీర్ లో అత్యధికంగా జయప్రదతో ఏకంగా 42 సినిమాలలో నటించారు.
ఆ తర్వాత విజయనిర్మలతో 40కు పైగా సినిమాల్లో నటించారు. ఇక అతిలోకసుందరి శ్రీదేవితో కూడా ఆయన నటించిన సినిమాలు సూపర్ హిట్గా నిలిచి.. కృష్ణ- శ్రీదేవి కాంబినేషన్ అంటే బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్ అన్న పేరు తెచ్చిపెట్టాయి. ఇక ఆ తర్వాత తరంలో విజయశాంతితోనూ ఆయన మంచి సినిమాల్లో నటించారు.