చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం ఎంతోమంది అమ్మాయిల పాలిట శాపంగా మారింది. ఇండస్ట్రీలోకి వచ్చి ఉన్నత స్థానానికి చేరుకుని.. తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని భావించే ఎంతోమంది ఆడవారు ఇలా క్యాస్టింగ్ కౌచ్ భారిన పడి ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. మరికొంతమంది ఇలాంటి వాటిని ఎదిరించి ఉన్నత స్థానానికి చేరుకుంటున్నారు. అయితే ఇది మాత్రం చాలా మంది అమ్మాయిలు జీవితాలను నాశనం చేస్తుందనే చెప్పాలి.
అయితే మీ టు ఉద్యమం వచ్చిన తర్వాత చాలామంది నిర్భయంగా తాము ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ సమస్యల గురించి బయటకు చెప్పుకుంటున్నారు. అయినా కూడా వారికి ఎటువంటి భద్రత కల్పించడం లేదని చెప్పవచ్చు. ఇకపోతే జై చిరంజీవ, అశోక్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ బ్యూటీ సమీరా రెడ్డి కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలేనట.
గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఏడుస్తూ ఏం చెప్పిందంటే.. నేను కూడా ఒక సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు ఆరోజు సెట్లో ఉండగానే స్క్రిప్ట్ మార్చి ముద్దు సన్నివేశం పెట్టారు. నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఆ సీన్ అందులో లేదు ఇక దాంతో నేను చెయ్యను అని చెప్పాను. మీ ఇష్టం ఆలోచించుకోండి ..మీరు చేయకపోతే మీ స్థానంలో వేరే వాళ్ళు వస్తారు అని హెచ్చరించారు.
ఇక వైకుంఠపాళి లాంటి ఈ సినిమా పరిశ్రమలో ఎవరైనా సరే పాముల నోటికి చిక్కకుండా అడుగులు వేయాలి అలా చేయడానికి నేను ఎంతో కష్టపడ్డాను. ఎన్నో సినిమాలను కూడా వదిలేసుకున్నాను. షూటింగ్ అయ్యాక జరిగే పార్టీ కల్చర్ కి నేను అలవాటు పడితే మరిన్ని సినిమాలు అవకాశాలు వస్తాయని తెలుసు..కానీ వద్దనుకున్నానని చెప్పింది.
బాలీవుడ్లో అగ్రిమెంట్ చేసిన ఒక సినిమా నిర్మాత వచ్చి మీరు ఈ పాత్రకు సరిపోరని చెప్పి వెళ్ళిపోయారు. దాంతో ఆ పాత్ర ఒక స్టార్ కిడ్ కి ఇవ్వడం జరిగింది. నెపోటిజం కూడా ఇండస్ట్రీలో చాలా ఎక్కువ.. ఇక నేను కూడా కాస్టింగ్ కౌచ్ భారిన పడ్డాను.. అయితే చిత్ర పరిశ్రమ నాకు ఎన్నో మంచి పాత్రలు ఇచ్చింది. అందుకే ఈ పరిశ్రమ గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడను అంటూ తెలిపింది సమీరారెడ్డి.