యంగ్ హీరో శర్వానంద్ శతమానం భవతి సినిమాతో కోట్లాదిమంది ప్రేక్షకుల అభిమానాలను సొంతం చేసుకున్నాడు. శర్వానంద్ ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. విజయవాడలో పుట్టిన శర్వానంద్ తండ్రి వ్యాపారవేత్త.. బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన శర్వానంద్ కి చిన్నప్పటి నుంచి సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండేది. అప్పట్లో రామ్ చరణ్, రానా క్లాస్మేట్స్గా ఉన్నా వారి మధ్య సినిమాల ప్రస్తావన కూడా వచ్చేది కాదు.
ఇంటర్ అయ్యాక సినిమాల్లోకి వెళ్లాలని శర్వానంద్ తన పేరెంట్స్ ని అడగగా వారు కూడా శర్వానంద్ ని ప్రోత్సహించారు. శర్వానంద్ తల్లి మాత్రం డిగ్రీ కూడా లేకుండా సినిమాల్లోకి వెళ్లడం కుదరదని కండిషన్ పెట్టారట. ఆ కండిషన్ ప్రకారం శర్వానంద్ సికింద్రాబాద్ కాలేజీలో బికాం పూర్తి చేశాడు. డిగ్రీ పూర్తయ్యాక జూబ్లీహిల్స్లో బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేసేవాడు. అక్కడ హీరో ఆర్యన్ రాజేష్ ని కలిసిన శర్వానంద్ నటనపై తనకు ఉన్న ఇంట్రెస్ట్ గురించి చెప్పాడట.
ఆర్యన్ రాజేష్ సూచన మేరకు ముంబైలోని నటనలో శిక్షణ కోర్సులో చేరాడు. ఆరు నెలలు ట్రైనింగ్ తీసుకుని తిరిగి హైదరాబాద్ వచ్చాడు. అయినా ఛాన్సులు రాలేదు. మరో ప్రయత్నం గా వైజాగ్ సత్యానంద్ యాక్టింగ్ స్కూల్లో చేరాడు. అక్కడ ఉండగానే ఓ ప్రొడ్యూసర్, దర్శకుడు కొత్త నటుల కోసం వెతుకుతూ అతడి స్కూల్ కి వచ్చారు. ఆ టైంలో శర్వానంద్ ని సెలెక్ట్ చేశారట. ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా చాలామందికి తెలియదు.
తర్వాత డైరెక్టర్ రమణ.. గౌరీ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం శర్వానంద్ కి ఛాన్స్ ఇచ్చాడు.
ఆ సినిమాలో మంచి పేరు రావడంతో తర్వాత యువసేన, శంకర్ దాదా ఎంబిబిఎస్, సంక్రాంతి, లక్ష్మి వంటి సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు. అలా రాజు మహారాజు సినిమాలో మోహన్ బాబుతో కలిసి నటించిన శర్వానంద్ కి తర్వాత గమ్యం సినిమాలో హీరో ఛాన్స్ వచ్చింది.
ఆ సినిమాతో సూపర్ హిట్ అవ్వడంతో శర్వానంద్ తర్వాత చాలా సినిమాల్లో నటించి స్టార్డమ్ సంపాదించుకున్నాడు. కాగా ప్రస్తుతం శర్వానంద్ సుధీర్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తున్నాడు.