దర్శకరత్న దాసరి నారాయణ రావుకు.. అన్నగారు రామారావుకు సినిమా రంగంలో ఎంతో స్నేహం ఉందో.. రాజకీయంగా అంతే వైరం ఉన్న విషయం తెలిసిందే. అన్నగారి విధానాలతో దాసరి విభేదించేవారు. ఒక వర్గానికే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించేవారు. అయితే.. ఆయన వాయిస్ బయటకు వచ్చేది కాదు. ఈ సమయంలోనే ఒక పత్రిక ప్రారంభించారు. అదే ఉదయం పత్రిక. ఈనాడుతో సమానంగా పుంజుకుంది.
అయితే.. అదేసమయంలో దాసరి సినిమాల్లోబిజీ అయిపోయారు. ఎడిటోరియల్ బాధ్యతలను అప్పటి సీనియర్ జర్నలిస్టులకు అప్పగించి.. తాను సినిమాల్లో ఉండిపోయేవారు. అయితే.. ఈ సమయంలో దాసరి సతీమణి పద్మ అరంగేట్రం చేశారు. ఉదయం పత్రిక మేనేజ్మెంట్ ఆమె చూసేవారు. తానే ఎండీనని చెప్పుకొనేవారు. అయితే.. ఆమె అజమాయిషీ భరించలేక సీనియర్ జర్నలిస్టులు అందరూ ధర్నాలు చేయడం ప్రారంభించారు.
ఈ విషయం దాసరి వరకు చేరేది కాదు. కొందరు మధ్యలో ఉండి.. అక్కడే సర్దుబాటు చేసేవారు. దీంతో పత్రిక ప్రమాణాలు పడిపోయాయి. సర్క్యులేషన్ కూడా దారుణంగా దెబ్బతింది. ఆ సమయంలో ఇండస్ట్రీ నుంచి డబ్బులు పంపించి మరీ పత్రికను నడిపేవారు దాసరి. అయితే.. ఇదంతా తనన సొమ్మేనని.. తన సొమ్మును జర్నలిస్టులకు పంచేస్తున్నాడని.. పద్మ యాగీ చేసేవారు.
అంతేకాదు.. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా..జర్నలిస్టులను అరెయ్ ఒరేయ్ అని పిలిచేవారట. అయితే.. దాసరికి ఈ విషయం తెలిసి.. ఏం చేయాలో ఎలా సర్దుబాటుచేయాలో అర్ధం కాక.. అమ్మే కదా.. సర్దుకుపోండి అని చెప్పేవారట. కానీ, ఎంతైనా జర్నలిస్టులు కదా.. అహం దెబ్బతింటే ఓర్చుకునేవారు కాదు. దీంతో ఏకంగా పత్రిక ఒకరోజు పూర్తిగా మూతబడింది.
నిజానికి ఉదయం వచ్చిన తర్వాతే.. ఈనాడు ఉద్యోగులకు డిమాండ్ పెరిగింది. అప్పుడే ఈనాడు జర్నలిజం స్కూల్ స్టార్ట్ చేశారు. జీతాలు పెంచారు. కానీ, దాసరి సతీమణి వ్యవహారంతో ఉద్యోగులు నరకం అనుభవించారని అప్పటి జర్నలిస్టులు చెప్పేవారు. మొత్తానికి పత్రికను మూత వేసుకోవడం కన్నా.. అమ్మేయడం బెటరని భావించి.. చివరకు అమ్మేశారు.