చిత్ర రంగం అంటేనే సమష్టి కృషి. ఇందులో తెరపై నటీనటుల అభినయము ఎంత ఉంటుందో. అదే స్థాయిలో తెరవెనుక దర్శక నిర్మాతలది అంతే పాత్ర ఉంటుంది. ఇద్దరూ సమభావాలతో ముందుకు వెళ్తేనే అపురూప చిత్రాలు వస్తాయి. అందరినీ ఆనంద పరుస్తాయి. కానీ ఇటీవల కాలంలో దర్శక నిర్మాతలకు, సినీ తారలకు మధ్య విభజన రేఖ స్పష్టంగా తెలుస్తున్నది. విభేధాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ వివాదాలు ఏకంగా రోడ్డుకెక్కుతున్నాయి. చిన్నచిన్న అంశాలే చిలికిచిలికి గాలివానగా మారినట్టు అవి పెద్దవవుతున్నాయి. పరస్పరం మీడియా వేదికగా విమర్శలు చేసుకునే దాకా వెళ్తున్నది ఒక్కకోసారి పరిస్థతి. ఇది ఒక్క తెలుగు చిత్రసీమనే కాదు, అటు కోలివుడ్, మాలివుడ్, బాలివుడ్, చివరకు హాలివుడ్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొన్నది.
ఇటీవలే అలా వెలుగులోకి వచ్చిన ఘటనలను పరిశీలిద్దాం. ఈ మధ్యనే తెరంగెట్రం చేసిన యువకుడు నాగశౌర్య అందులో ముందుంటాడు. తనకు బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన దర్శకుడినే వెంకీ కుడుములపై ప్రమోషన్ వేడుక సాక్షిగా నిందలు మోపాడు. అది చిత్ర పరిశ్రమలో పెద్ద దుమారాన్నే లేపింది. ఏకంగా ఆ దర్శకుడి వద్ద విషయమ ఏమీ లేదని, కథ కూడా తానే రాసిచ్చానని అంటూ చెప్పుకురావడం వివాదానికి కారణమైంది. అయితే దీనిపై వెంకీ అంతగా స్పందించకుండా హుందగా వ్యవహరించాడు. దీంతో ఆ వివాదం సద్దుమణిగింది. కానీ ఇటీవలే ఆయన దర్శక్తత్వం వహించిన భీష్మ సినిమా విడుదలైన అనంతరం ఈ అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. హీరో నాగశౌర్యకు సినిమా ద్వారా కౌంటర్ ఇచ్చాడని సోషల్మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అదే విధంగా తమిళ సూపర్ స్టార్ అల్లుడు, హీరో ధనుష్పై కూడా పలువురు నిర్మాతలు మండిపడ్డారు. రెమ్యూనరేషన్ తీసుకోవడానికి నానా కష్టాలు పడుతున్నామని ఆయన చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో నిర్మాత ఎల్ అలగప్పన్ విరుచుకుపడ్డారు. ఇటీవలే విశాలకు, దర్వకుడు మిస్కిన్కు మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. ఏకంగా తుప్పరివాలన్ తెలుగులో డిటెక్టివ్ 2 సినిమా ప్రాజెక్టు షూటింగ్ను మధ్యలోనే ఆయన తప్పుకోవడం గమనార్హం. అదేవిధంగా హీరో శింబుపై, భారీ చిత్రాల నిర్మాత జ్ఞానవేల్ రాజా నిర్మాతల కౌన్సిల్ లో ఫిర్యాదు చేశారు. అతను షూటింగ్ కు రాని కారణంగా తన చిత్ర నిర్మాణ ఖర్చులు భారీగా పెరిగి పోయాయని వాపోవడం వివాదానికి దారి తీసింది. ఇలా ఈ వివాదాల జాబితాలో ఇంకా జై తదితర కుర్ర హిర్రోలు మొదలు పలువురు అగ్రతారలు కూడా ఉండడం గమనార్హం.
అదేవిధంగా హీరోలే కాదు హీరోయిన్లు కూడా ఇలాంటి వివాదాల్లో చిక్కుకున్నారు .నిర్మాతలో బేధాబిప్రాయాలు వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఇటీవలె సీనియర్ నటి త్రిషపై దర్శక నిర్మాత తిరుజ్ఞానం నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసేంత వరకూ వెళ్లింది వారి వ్యవహారం. ‘పరమపదం విళైయాట్టు’ చిత్రంలో నటించిన త్రిష, ఆ సినిమా ప్రమోషన్ కోసం హాజరు కాకపోవడంపై ఆయన మండిపడ్డారు. అదేవిధంగా మరో కథనాయిక నయనతారను తట్టుకోలే మంటూ పలువురు తమిళ నిర్మాతల గగ్గోలు పెడుతున్నారు. ఆమె మెయింటనెన్స్ ఖర్చులు భారంగా మారుతున్నాయని వాపోతున్నారు. ముద్దుగుమ్మ మెహ్రిన్పైనా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. అశ్వత్థామ సినిమా ప్రమోషన్లకు హాజరుకావడం లేదని ఆరోపణలు వినిపించాయి. ఇటీవలే ఆమె దానిపై స్పందించి తనను నిర్మాతలే ఇబ్బందులు గురిచేశారని వెల్లడించడం విశేషం. బాలివుడ్లో కంగన రనౌత్ కూడా వివాదాలను ఎదుర్కొన్నారు. స్టార్ డైరెక్టర్ క్రిష్ తో మణికర్ణిక సినిమా మొదలు పెట్టినా మధ్యలోనే ఆయనను ఇంటికి పంపారు ఆ భామ. ఇంకా చాలా మందే హీరోయిన్లు ఈ జాబితాలో ఉన్నారు. మొత్తంగా ఏతా వాతా చెప్పొచ్చేదేమిటంటే దర్శక నిర్మాతలకు, నటీనటులకు ఎక్కడా పొసగడం లేదని, ఈ మధ్య వారి సంబంధాలు అంతగా బాగుడడం లేదని ప్రస్పుటమవుతుంది. ఎప్పుడు ఎవరి మధ్య వివాదం చెలరేగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.