ఆది నుంచి కూడా టీడీపీ అంటేనే బీసీలకు పక్షపాతి.. అనే పేరున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనేక మందికి నాటి నుంచి నేటి వరకు.. పార్టీలోను.. ప్రభుత్వంలోనూ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక, ఇప్పు డు ప్రతిపక్షంలో ఉండి కూడా.. మరోసారి బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబునిర్ణయించారు. ఈ నెల 23న జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తలపడనుంది.
ఈ క్రమంలో పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టాలని.. నిర్ణయించినట్టు సమాచారం. అది కూడా బీసీ సామా జిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. నిజానికి ఇప్పుడు న్న పరిస్థితిలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. అయినప్పటికీ.. బీసీల కేంద్రంగా వైసీపీ రాజకీయం చేస్తోంది.
దీనిని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు తాజా స్టెప్ తీసుకున్నట్టు పార్టీలో చర్చ సాగుతోంది. వాస్తవానికి 40 ఏళ్లుగా టీడీపీ బీసీలకు ప్రాధాన్యం ఇచ్చింది. కానీ, ఇప్పుడు అంటే.. ఓ పదేళ్ల కిందట పుట్టిన వైసీపీ తామే బీసీలకు బ్రాండ్ అన్నట్టుగా రాజకీయాలు చేస్తోంది. తామేబీసీలకు వెన్ను దన్ను.. అని చెప్పుకొంటోంది. ఇలాంటి సమయంలో వైసీపీకి మైండ్ బ్లాంక్ అయ్యేలా.. చంద్రబాబు వ్యూహం సిద్ధం చేస్తున్నారట.
బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని చంద్రబాబు తలపోస్తున్నారు. ఇదే జరిగితే.. వైసీపీ ఇరకాటంలో పడిపోతుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని, ముఖ్యంగా మహిళలకు ఎక్కడా లేని ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకొనే వైసీపీ.. టీడీపీ నిలబెట్టే అభ్యర్థిని ఓడిస్తే.. బీసీలపై ఆ పార్టీకి ఏమేరకు ప్రేమ ఉందో తెలిసిపోతుందని..అంటున్నారు. దీనిని చంద్రబాబు ఎన్నికల అస్త్రంగా మలుచుకుంటారని అంటున్నారు. మరి వైసీపీ ఏం చేస్తుందో చూడాలి.