మరో ఆరు మాసాల్లో ఏపీ రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకుంటాయా? ముఖ్యంగా అధికార పార్టీలో భారీ ఎత్తున మార్పులు జరుగుతాయా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. దీనికి కారణం.. టీడీపీ నేత అమర్నాథ్ రెడ్డి కొన్ని రోజుల కిందట చేసిన సంచలన వ్యాఖ్యలే. మరో ఆరు మాసాల్లోదాదాపు 60 మంది వరకు.. తమ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తారని.. ఇప్పటికే పదుల సంఖ్యలో నాయకులు టచ్లో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ పరిణామం తర్వాత.. వైసీపీలోనూ ఇదే తరహా చర్చసాగింది. వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్లు ఇస్తారు..? ఎవరికి ఇవ్వరు? అనే విషయంలో వైసీపీ అధిష్టానం ఇంకా తేల్చలేదు. ప్రస్తుతం మీరు గడపగడపకు తిరిగితేనే టికెట్లు అని చెబుతున్నారు. కానీ, ఈ వ్యూహంపైనే ఎమ్మెల్యేలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ తనకు అనుకూలంగా ననిర్ణయాలు తీసుకుంటే.. తాము బలి అయిపోవడం ఖాయమని చెబుతున్నారు.
అందుకే.. అనుమానంగా ఉన్న నాయకులు గడపగడపకు కార్యక్రమానికి చాలా దూరంగా ఉంటున్నారు. మరికొందరు ఏదో తూతూ మంత్రంగా పనిచేస్తున్నారు. ఇక, తూర్పు, పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాలకు చెందిన నాయకులు ఇప్పటికే పార్టీలో దూరంగా ఉంటున్నారని.. సమాచారం. ఏదైనా తేడా వస్తే.. టీడీపీ తరఫున బరిలో దిగినా ఆశ్చర్యం లేదని ఇలాంటి నాయకులను గమనిస్తున్నవారు చెబుతున్నారు.
అయితే.. ఈ క్రమంలో 60 మంది నాయకులు ఒకే సారి జంప్ చేస్తారా? అనేది ప్రశ్న. చేయనూ చేయొచ్చని పరిశీలకులు చెబుతున్నారు. ప్రస్తుతం కోటంరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి ఎలానూ వైసీపీ నుంచి బయటకు వచ్చేసినట్టే. ఈ పరంపరలోనే ప్రకాశం జిల్లా నుంచి కూడా నలుగురు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని.. వారు టీడీపీలోకా? జనసేనలోకా? అనేది తేలాల్సి ఉందని వైసీపీలోనే చర్చ సాగుతోంది. ఇలా.. జిల్లాకు ఇద్దరేసి చొప్పున వేసుకున్నా.. 60 లెక్క దాటడం పెద్ద కష్టం కాదనే అంచనాలు వున్నాయి. మరి వైసీపీ అధినేత ఇంత మందిని పోగొట్టుకునేందుకు రెడీగా ఉన్నట్టేనా? అనేది చూడాలి.