వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆదిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ప్రకటించిన పథకం.. ఐడియాలజీ కాన్సెప్టు!..ఇది వినేందుకు బాగానే ఉన్నా.. అర్ధం చేసుకోవడం మాత్రం కొంత లోతుగా ఉంటుంది. రాష్ట్రంలోనిప్రతి కుటుంబానికీ ఆర్థిక ప్రగతి ఫలాలు అందించాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశం. దీనిని ఆయన తన పుట్టిన రోజు సందర్భం గా మార్కాపురంలో ప్రకటించారు.
ఆర్థిక ప్రగతి అనేది .. అన్ని కుటుంబాలకు అందేలా చూడడం `ఐడియాలజీ కాన్సెప్ట్` విధానం. ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే ఈ కాన్సెప్టును పక్కాగా అమలు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రత్యే కంగా ఒక శాఖను ఏర్పాటు చేస్తారు. ఈ లక్ష్యం ఎలా సాధించాలన్నదానిపై ఒక విధానాన్ని కూడా రూపొందిస్తారు. ఒక కుటుంబాన్ని యూనిట్గా తీసుకుని దానిని ఆర్థికంగా పరిపుష్టం చేయడమే.. ఈ కాన్సెప్టు లక్ష్యంగా ఉంది.
15-20 ఏళ్లలో ఈ అభివృద్ధి ఫలాలు అందుతాయి. రాష్ట్రంలో పోర్టులు, నగరాలను అభివృద్ధి కేంద్రంగా మలిస్తే వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి అభివృద్ధి ఫలాలు అందుతాయి. ప్రతి కుటుం బ వాస్తవ స్థితిగతులు, ఆ కుటుంబంలోని మానవ వనరులు వంటివి పరిగణనలోకి తీసుకుని ఒక ప్రణాళిక తో వెళ్తే 10-15 ఏళ్లలో మొత్తం కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తేవచ్చు.
ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీతో ప్రతి కుటుంబం పరిస్థితిని పర్యవేక్షించడం కీలకం. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక సాఫ్ట్ వేర్ను ఏర్పాటు చేసుకుంటారు. అదేసమయంలో కీలకమైన 4 అంశాలను ప్రస్తావించారు.
+ సమానత్వ హక్కును పునర్నిర్వచించి సమాజంలో ఆర్థిక అంతరాలు లేకుండా చేయడం.
+ 2047 నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు అవుతుంది. ఆ నాటికి తెలుగు సమాజం పేదరికం లేని సమాజంగా దేశంలో నిలవాలి.
+ సాంఘిక సాంస్కృతిక వెనుకబాటు కూడా సమాజంలో కొన్ని కులాలు, వర్గాల వెనుకబాటుకు కారణమవుతోంది. ఆయా వర్గాలకు ఆర్థిక, సామాజిక వారధి నిర్మాణంపై దృష్టి సారించాలి.
+ ప్రవాసాంధ్రులు, సంపన్న తెలుగు వర్గాల వారికి భాగస్వామ్యం కల్పించి కొన్ని కుటుంబాలను ఆర్థికంగా పైకి తేవడానికి కృషి చేయాల్సి ఉంటుంది.