ఏపీలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా ఆసక్తికరంగా మారుతున్నాయి. మూడు చోట్ల పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే టీడిపి క్లీన్ స్విప్ చేసేసింది. అది కూడా వైసిపి కంచుకోటలు లాంటి జిల్లాలు కావటం సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనూ సైకిల్ ప్రభంజనం కనిపించడం నిజంగా అధికార పార్టీకి మింగుడు పడటం లేదు. చంద్రబాబు పట్టభద్రుల నియోజకవర్గాల్లో మూడు చోట్ల జగన్ కు పెద్ద షాకే ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలోను అదే షాక్ ఇవ్వాలని బాబు కసితో ఉన్నారు.
ఈనెల 23వ తేదీన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. టీడిపి ఇప్పటికే తమ పార్టీ ఎమ్మెల్యేలకు విప్పి జారీ చేసింది. ప్రకాశం జిల్లా కొండపి టీడిపి ఎమ్మెల్యే, ఆ పార్టీ విప్ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి టీడీపీ ఎమ్మెల్యేలు అందరికీ విప్ జారీ చేశారు.విప్కు వ్యతిరేకంగా ఓటు వేస్తే పార్టీ నుంచి అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలకు విప్ను వ్యక్తిగతంగా కూడా అందజేసింది. టీడిపి ఈనెల 23న జరిగే ఎన్నికలలో పాల్గొని పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఓటు వేయాలని ఆదేశించింది.
ఏడు స్థానాలకు వైసీపీ అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు వేశారు. టిడిపి కూడా తన అభ్యర్థిని రంగంలోకి దింపింది. ఒక ఎమ్మెల్సీ నెగ్గాలి అంటే కనీసం 22 మంది సభ్యుల మద్దతు అవసరం. కానీ ప్రస్తుతం టీడిపికి 19 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. నలుగురు వైసీపీకి జై కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ 19 ఓట్లకు తోడు వైసీపీలో అసంతృప్త ఎమ్మెల్యేలుగా ముద్రపడిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆనం రామనారాయణరెడ్డి ఇద్దరు కూడా టిడిపికే ఓట్లు వేస్తారని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో వీరికి టీడిపి నుంచి చంద్రబాబు ఎమ్మెల్యే టికెట్లు ఖరారు చేశారని.. వీరి ఓట్లు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడిపికే పడతాయని టీడిపి నేతలు చెబుతున్నారు. ఈ ఇద్దరు నేతలు టీడిపికి ఓటు వేసినా 21 ఓట్లే పడతాయి. అంటే టీడిపి ఎమ్మెల్సీ గెలవాలంటే మరో ఓటు కూడా అవసరం. కచ్చితంగా వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతల్లో ఒకరిద్దరు కూడా తమ అభ్యర్థికి ఓటు వేస్తారని.. ఈ ఎన్నికల్లో కూడా వైసీపీకి షాక్ ఇస్తామని చంద్రబాబు ధీమాతో ఉన్నట్టు తెలుస్తుంది. వైసీపీలో ఒకరిద్దరు కోవర్ట్ లు కూడా ఉన్నారన్న సందేహాలు ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. వచ్చే ఎన్నికలలో ఎలాగూ జగన్ తమకు సీటు ఇవ్వరని డిసైడ్ అయిన ఎమ్మెల్యేల్లో కొందరు ఆ పార్టీకి ఈ ఎన్నికలు సాక్షిగా షాక్ ఇస్తారని అంటున్నారు. మరి చంద్రబాబు, టీడీపీ వాళ్ళ లెక్కలు ఎంతవరకు కరెక్ట్ అవుతాయో చూడాలి.