శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హోంశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే మొదటి నుంచి కళాకు శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు ఫ్యామిలీతో విభేదాలు ఉన్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు కళా ప్రజారాజ్యంలోకి వెళ్లి తిరిగి టిడిపిలోకి వచ్చారు. 2014 ఎన్నికలలో పార్టీ గెలిచాక చంద్రబాబు కళాను ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా చేయడంతో పాటు మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. అయితే ఇప్పుడు అచ్చెం నాయుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉండడంతో కళాకు చాప కింద నీరులా సెగ తగులుతుంది.
చివరకు కళా సొంత నియోజకవర్గం ఎచ్చెర్ల లోను కింజారపు ఫ్యామిలీ భక్తుడు అచ్చం నాయుడు శిష్యుడు కలిశెట్టి అప్పలనాయుడు పాగా వేసి ఉన్నారు. ఇప్పుడు వచ్చే ఎన్నికలలో సీటు కోసం అప్పలనాయుడుకు వెంకట్రావుకు మధ్య గట్టి పోరు నడుస్తోంది. అప్పలనాయుడుకు అచ్చెన్న ఆశీస్సులు ఉండడంతో నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే అచ్చన్న మాటకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో చంద్రబాబు కళా వెంకట్రావుకు చిన్న ట్విస్ట్ ఇస్తున్నట్టు తెలుస్తోంది.
ఇపుడు కళాను తెచ్చి విజయనగరం నుంచి లోక్ సభకు పోటీ పెట్టాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. గత ఎన్నికలలో ఎంపీగా పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఓడిపోయారు. ఈ సారి ఆయన విజయనగరం అసెంబ్లీ బరిలో ఉండనున్నారు. దీంతో కళా వెంకటరావు ఈ సారి విజయనగరం ఎంపీ బరిలో ఉండనున్నారు. పైగా సామాజిక సమీకరణల పరంగా కూడా ఈ లోక్సభ పరిధిలో తూర్పు కాపుల ప్రాబల్యం ఎక్కువ.
ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో అచ్చెన్న, కళా వర్గ పోరు చంద్రబాబుకు కూడా సమస్యగా మారింది. అందుకే ఈ సారి కళాను విజయనగరం పార్లమెంటకు పోటీ చేయించి.. అచ్చెన్న శిష్యుడు అప్పలనాయుడుకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే సీటు ఇస్తే ఇద్దరికి ఇబ్బంది ఉండదనే చంద్రబాబు ప్లాన్. అయితే కళా మాత్రం అసెంబ్లీకే పోటీ చేసి మంత్రి అవ్వాలని చూస్తున్నా ఆ కోరిక నెరవేరేలా లేదు.