ఏపీలో స్టిక్కర్ల రాజకీయం ఊపందుకుంది. వైసీపీ నాయకులు.. పార్టీ అధినేత, సీఎం జగన్ ఆదేశాలతో ప్రజల మధ్య ఉంటూ.. స్టికర్లు అంటిస్తున్నారు. `జగనే మా భవిష్యత్తు`- `మా నమ్మకం నువ్వే జగన్` నినాదాలతో వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా 14 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లేలా ప్లాన్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు .. ఇంటింటికీ వెళ్లి స్టిక్కర్లు అంటిస్తున్నారు.
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ స్టిక్కర్లపై కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. అయితే.. మొత్తంగా చూస్తే.. వైసీపీ దూకుడు పెరుగుతోంది. దీనిని గమనించిన.. టీడీపీ వైసీపీ స్టిక్కర్లకు కౌంటర్గా టీడీపీ యువ విభాగాన్ని రంగంలోకి దింపింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ యువ విభాగం నాయకులు.. `మాకు నమ్మకం లేదు.. జగన్` అనే నినాదంతో ఉన్న స్టిక్కర్లను ప్రతి ఇంటికీ అంటిస్తున్నారు.
ఈ క్రమంలో ఆ ఇంటి యజమానికి గత టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందో.. ఏమేరకు పథకాలు అమలు చే సిందో.. ఏయే పథకాలతో ఒక్కొక్క కుటుంబానికీ ఎంతెంత లబ్ధి చేకూరిందో వివరిస్తున్నారు. అదేసమ యంలో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఎలా మాయచేస్తోందో.. ఒక చేత్తో 100 రూపాయలు ఇచ్చి.. మరో చేత్తో ధరలు పెంచుతూ.. రూ.1000 ని దండుకుంటున్న తీరును కళ్లకు కట్టినట్టు ఆధారాలతో సహా టీడీపీ తెలుగు యువత నేతలు వివరిస్తున్నారు.
ఈ పరిణామంతో అధికార పార్టీ వైసీపీ నాయకులు బెంబేలెత్తుతున్నారు. తాము ఎంతో చెబుతున్నా.. ఇప్పు డు టీడీపీ ఎంట్రీతో తమ ప్రయత్నం మొత్తం నీరు గారిపోయిందని నాయకులు భావిస్తున్నారు. అంతేకాదు.. తాము ఏ ఇంటికి వెళ్తే.. ఆ ఇంటికి టీడీపీ నాయకులు రావడం.. వెంటనే తమ స్టిక్కర్ కిందనే కౌంటర్ స్టిక్కర్ అంటించడం.. చూసి.. రగిలిపోతున్నారు. కానీ రాజకీయంగా ఇవన్నీ మామూలే కనుక..వారేమీ చేయలేక.. లబోదిబో మంటున్నారు. మొత్తానికి ఏపీలో టీడీపీ వర్సెస్.. వైసీపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి.