అనంతపురం జిల్లాలో మంత్రి శంకర్ నారాయణ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘వసూళ్ళ నారాయణ’ అంటూ నెట్టింట్లో జోరుగా ప్రచారం కొనసాగుగుతున్నది. ఇది వైసీపీ నేతలకు, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రచారం చేస్తున్నవారిని పట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పడిది ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై భిన్న వాదనలు వినవస్తున్నాయి. ఇంతకి విషయం ఏమిటంటే.. అనంతపురం జిల్లా పెనుకొండలో పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని వైసీపీ ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో మంత్రి అనుచరులు రంగంలోకి దిగి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారని తెలుస్తున్నది. ఇళ్ల పట్టాను ఇప్పించేందుకు ఒక్కొక్కరి నుంచి రూ. 20వేల చొప్పన వసూలు చేశారని, ఆపై స్థలం చూపించలేదని, పలువురు ఆందోళనకు దిగడం, ఆ పంచాయతీ ఠాణా దాకా వెళ్లడం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటన అనంతరం నారాయణపై సోషల్మీడియాలో ప్రచారం జోరందుకుంది. మంత్రి నారాయణ వసూళ్ల నారాయణ అంటూ సోషల్మీడియాలో ప్రచారం సాగుతుండడం గమనార్హం.
ఇదిలా ఉండగా దీనిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. సీఎం జగన్ పారదర్శక పాలన అందించాలని ప్రయత్నిస్తుంటే, మరోవైపు మంత్రి పై ఈ ఆరోపణలు రావడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. తాజాగా మంత్రిపై కొందరు కావాలనే విషప్రచారం చేస్తున్నారని తెలుపుతు కియా ప్రైవేట్ లిమిటెడ్ పరిధిలోని పోలీస్స్టేషన్లో వారు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టి పెనుగొండ మండలం వెంకటగిరి పాలెం డి గ్రామానికి చెందిన శ్రీదర్రెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఇప్పుడిదే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై పలురకాలు చర్చలు సాగుతున్నాయి. కావాలనే దుష్ర్పచారం చేస్తున్నారని అధికార పక్షం నేతలు తెలుపుతుంటే.. నిప్పులేనిదే పొగరాదుకదా? అని విఫక్ష నేతలు కొట్టిపారేస్తున్నారు. ఏదేమైనా అధికార పక్షంలో ఉన్నప్పడు ఇలాంటి విమర్శలు పరిపాటిగా మారింది.