రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలపై స్వయంగా ఢిల్లీ పెద్దలతో చర్చించేందుకు శుక్రవారం ప్రత్యేక విమానంలో ఏపీ సీఏం వెళ్లిన సంగతి తెలిసిందే. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సుమారు అరగంటకు పైగా ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పది అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. మూడు రాజధానుల ఏర్పాటు ఆవశ్యకతను, అందుకు గల కారణాలను, హైకోర్టును కర్నూలుకు తరలింపు, శాసన మండలి రద్దు బిల్లు తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. షెడ్యూల్ ప్రకారం ఢిల్లీ నుంచి ఇవాళ ఆయన తిరుగుప్రయాణమై ఏపీకి రావాల్సి ఉంది.
ఇదిలా ఉండగా అఖరి నిమిషంలో కేంద్రమంత్రుల అపాయింట్ మెంట్ కూడా ఖరారు కావడంతో సీఎం జగన్ వెంటనే తన టూర్ షెడ్యూల్ను మార్చుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఇద్దరు కేంద్రమంత్రులతో సమావేశమైన ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించి అనంతరం రాష్ట్రానికి తిరుగు ప్రయాణం కానున్నారు. తొలుత న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్తో భేటీ కానున్నారు. ప్రధానంగా కర్నూలుకు హైకోర్టు తరలింపు విషయాన్ని ఆయన చర్చించనున్నారు. అందుకు సంబంధించిన శాఖల తరలింపునకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా కేంద్ర జలనవరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్తో కూడా సీఎం జగన్ భేటీ అవుతున్నట్లు సమాచారం. పోలవరం పనులకు సంబంధించిన అంశాలతో పాటు.. నిధుల విషయంలో కూడా చర్చలు జరపునున్నట్లు తెలుస్తున్నది. అనంతరం ఏపీకి తిరుగు ప్రయాణం కానున్నారు. ఇంతకు ముందు బుధవారం రోజునే ప్రధాని నరేంద్రమోడీతో జగన్ సమావేశమయ్యారు.