రాజకీయాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. గత ఎన్నికల్లో జగన్ బొమ్మను పెట్టుకుని విజయం దక్కించు కున్న వారు ఇప్పుడు మల్లగుల్లాలు పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో నన్ను చూపించికాదు.. మిమ్మల్ని మీరు ప్రొజెక్టు చేసుకుని విజయం దక్కించుకోవాలి.. పార్టీని కూడా గట్టెక్కించాలి.. అని వైసీపీ నాయకుడు.. సీఎం జగన్ ఎమ్మెల్యేలకు స్పష్టం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా మంది సర్దు కుంటున్నారు. తమకు అనుకూలంగా ఉన్న నియోజకవర్గాలపై దృష్టి పెడుతున్నారు.
ఈ క్రమంలోనే పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికూడా.. తనకు అనుకూలంగా ఉన్న నియోజకవర్గంవైపు అడుగులు వేస్తున్నారని అంటున్నారు వైసీపీ నాయకులు. ప్రస్తుతం ఆయన గురజాల ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఆయన విఫలమయ్యారనే వాదన వినిపిస్తోంది. దీనికి తోడు.. స్థానికంగా.. ఉన్న జంగా కృష్ణమూర్తితో వివాదాలు.. విభేదాలు కూడా ఆయనకు ఇబ్బందిగా మారాయి.
మరోవైపు.. టీడీపీ ఇప్పుడు గుజరాలలో భారీ ఎత్తున పుంజుకుంది. మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు.. పార్టీ కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ.. గత ఎన్నికల్లో తాను ఓడినప్పటికీ.. ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ యరపతినేని ముందుకు సాగుతున్నారు. ఏ చిన్న కష్టం వచ్చినా.. ఆయన తన ఇంటి తలుపులు తెరిచే ఉంచుతున్నారు.
దీంతో ప్రజల చూపు మళ్లీ యరపతినేనిపైనే పడింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన గెలుపు నల్లేరుపై నడకే అవుతుందని అంటున్నారు పరిశీలకులు. ఈ పరిణామాలను గమనించిన కాసు మహేష్రెడ్డి .. ఇక్కడే ఉంటే దెబ్బతింటామని ఆలోచన చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీంతో ఆయన తిరిగి న రసారావు పేటకు వెళ్లిపోవాలన్న ఆలోచనతో అటు కన్నేసినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే నరసారావుపేటలో రెండుసార్లు గెలిచిన గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డికి సీటుకు ఎర్త్ పెట్టేస్తారన్న టాక్ కూడా స్థానికంగా వినిపిస్తోంది. మరి జగన్ డెసిషన్ ఎలా ఉంటుందో ? చూడాలి. ఏదేమైనా కాసు మహేష్రెడ్డికి మాత్రం గురజాలలో పోటీ చేసే విషయంలో నైరాశ్యమే కనిపిస్తోన్నట్టుగా ఉంది.