ఏపీలో వచ్చే సాధారణ ఎన్నికలలో టీడిపి జనసేన పొత్తు దాదాపు ఖాయమైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తాజాగా మచిలీపట్నంలో జరిగిన పార్టీ పదో వార్షికోత్సవ సభలో ఈ విషయాన్ని చూచాయిగా చెప్పేశారు. అక్కడి వరకు బాగానే ఉంది. జనసేనకు టీడిపి ఎన్ని సీట్లు ఇస్తుంది ఏ ఏ సీట్లు ? జనసేన ఆశిస్తుంది.. జనసేనకు ఇచ్చే సీట్లలో టిడిపి నేతలు త్యాగాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారా.. ఇప్పుడు ఇవే ప్రశ్నలు టిడిపిలో హాట్ టాపిక్ గా మారాయి.
జనసేన ఎక్కువగా పట్టున్న జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, ఉత్తరంలోని విశాఖ జిల్లాలలో ఎక్కువ సీట్లు ఆశిస్తున్నట్టు కూడా జనసేన నేతల మధ్య చర్చలు మొదలయ్యాయి. జనసేన బలం అంతా ఉభయగోదావరి జిల్లాల్లోనే ఎక్కువ. ఈ రెండు జిల్లాలలోనే ఆ పార్టీ ఎక్కువ సీట్లు ఆశిస్తుందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో జనసేనతో పొత్తు వల్ల కొందరు టిడిపి లీడర్లు టికెట్లు త్యాగం చేయక తప్పని పరిస్థితి.
2009 ఎన్నికలలో చిరంజీవి పాలకొల్లులో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఐదువేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఈ జిల్లాలో నరసాపురం, భీమవరం, ఏలూరు సీట్లలో ప్రజారాజ్యం రెండో స్థానంలో నిలిచింది అలాగే తాడేపల్లిగూడెంలో జయకేతనం ఎగురవేసింది. ఈసారి కూడా జనసేన గతంలో ప్రజారాజ్యం గెలిచిన తాడేపల్లిగూడెం సీటుతో పాటు గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన భీమవరం, పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం నరసాపురం సీట్లు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది.
అలాగే చింతలపూడి ఎసీ రిజర్వ్ డ్ నియోజకవర్గంతో పాటు ఏలూరు సీటు పైన కన్నేసింది. విశ్వశనీయ వర్గాల సమాచారం ప్రకారం టీడిపి అధిష్టానం కూడా తాడేపల్లిగూడెం, భీమవరం, నరసాపురం సీట్లను జనసేనకు ఇచ్చేందుకు మానసికంగా సిద్ధమై ఉందని.. అందుకే అక్కడ అంతా బలమైన అభ్యర్థులను ఇన్చార్జిలుగా పెట్టలేదని కూడా చర్చ నడుస్తోంది.
తాడేపల్లిగూడెంలో వలవల తాతాజీ, నరసాపురంలో రామరాజు, భీమవరంలో తోట జగదీష్ ఇన్చార్జిలుగా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ముగ్గురు నేతలు టీడిపి టికెట్లు తమవే అన్న ధీమాతో ఉన్నా… ఎన్నికలవేళ జనసేనతో పొత్తు కుదిరితే ఈ సీట్లను వాళ్ళు వదులుకోక తప్పదని తెలుస్తోంది.