అలవైకుంఠపురంలో చిత్రం విజయాన్ని స్టైలిష్ స్టార్ ఆస్వాదిస్తున్నారు. ఆ ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. ఆ చిత్రం కోసం సుమారు ఏడాదిన్నర పాటు విరామం తీసుకున్న ఈ యువ హీరో మరోసారి అలాంటి తప్పు చేయనని ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగానే తర్వాతి చిత్రాన్ని శరవేగంగా తెరకెక్కించాలని ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అల్లు అర్జున్ సినిమా తర్వాతి చిత్రానికి సుకుమార్ దర్శకత్వం విహించనున్న విషయం విధితమే. ఇప్పటికే సినిమా షూటింగ్ ప్రారంభమైనా అలవైకుంటపురంలో సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో బన్నీ ఇంకా ఆ మూవీ సెట్లోకి అడుగుపెట్టలేదు. అయితే అందుకు అనుగుణంగానే బన్నీ లేని సన్నివేశాలను ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్నారని టాలివుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. త్వరంలోనే బన్నీ సైతం సినిమా షూటింగ్లో పాల్గొంటారని తెలుస్తున్నది.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే పూర్తిగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉంటుందని టాలివుడ్లో చర్చ కొనసాగుతున్నది. కథ మొత్తం శేషాచలం కొండల చుట్లు తిరుగుతుందని సమాచారం. అందుకే సినిమాకు అదే టైటిల్ను ఖరారు చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తున్నది. త్వరంలోనే అధికారికంగా ప్రకటించే అవకాశముందని టాలివుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన కన్నడభామ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుండగా, మరో కీలకపాత్రలో బుల్లితెర వ్యాఖ్యత అనసూయ దర్శనమివ్వనున్నట్లు సమాచారం. ఇప్పటికే అందుకు సంబంధించిన అన్ని చర్చలు పూర్తయ్యాయని టాలివుడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా సుకుమార్ దర్శకత్వంలో, రామ్చరణ్ హీరోగా తెరకెక్కి రంగస్థలం సినిమాలో అనసూయ నటించిన సంగతి తెలిసిందే. అందులో రంగమత్తగా ఒదిగిపోయి అందరి ప్రశంసలను అందుకున్నది. తాజాగా మళ్లీ సుకుమార్ కాంబినేషన్లోనే మరోసారి నటించనుండడంతో అనసూయ పాత్రపై అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి దర్శకుడు సుకుమార్ ఈ సారి ఆమెకు ఎంతటి పవర్ఫుల్ పాత్రను ఇస్తారోనని అప్పుడే చర్చలు జోరందుకున్నాయి.