ఏపీ రాజధాని ప్రాంతం అమరావతి విషయంలో ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో ఈ ప్రాంతంలో ని మొత్తం నాలుగు నుంచి ఐదారు నియోజకవర్గాల్లోనూ ప్రజలు ఒకింత ఆగ్రహంతో ఉన్నారు. తాడికొండ, ప్రత్తిపాడు, చిలకలూరిపేట, మంగళగిరి, పెదకూరపాడు, పొన్నూరు నియోజకవర్గాలు అమరావతికి అనుసం ధానంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిం చింది. పొన్నూరు, చిలకలూరిపేట వంటి కీలకమైన నియోజకవర్గాల్లోనూ టీడీపీని ఓడించి హిస్టరీ సొంతం చేసుకుంది.
అయితే, గత 20 రోజుల కిందట సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనతో ఈ నియోజకవర్గాల్లో రైతులు కావొచ్చు.. ప్రజలు కావొచ్చు.. రోడ్లమీదకు వచ్చారు. తమకు న్యాయం చేయాలంటూ.. ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఈ నిరసన సెగలు అనుభవించాల్సి వస్తోంది. ఇక, ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే.. వైసీపీ దిగువ స్థాయి కేడర్ కూడా ఆందోళనలకు మద్దతిస్తోంది. అంతేకాదు, కొన్ని నియోజకవర్గాల్లోని ప్రభుత్వ కార్యాల యాలకు కొత్తగా వేసిన వైసీపీ జెండా రంగులను తుడిచేసి, నల్లరంగు పూసి ఆందోళన చేశారు.
అయితే, వీరిపై చర్యలు తీసుకోవాలంటే, వారంతా కూడా వైసీపీకి మద్దతిచ్చినవారే. ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసేవారే. దీంతో ప్రభుత్వం వీరిపై కేసులు నమోదు చేయలేదు. అయితే, ఈ వ్యతిరేకత అంతటితో ఆగిపోలేదు. ఇప్పుడు గ్రామ గ్రామానికి కూడా పాకుతోంది. ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేల్లో ఫైర్ బ్రాండ్లు ఉన్నా రు. విడదల రజనీ, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉండవల్లి శ్రీదేవి వంటి వారు ఇటీవల కాలంలో మీడియా ముందు సంచలన ఆరోపణలు చేసి ప్రతిపక్షంపై దుమ్మెత్తి పోశారు. అలాంటివారు ఇప్పుడు బయటకు రాలేని పరి స్థితిని ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో అమరావతిని ఇక్కడి నుంచి తరలించే విషయం మరింతగా బలపడుతుండడంతో ఇక్కడ వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి వస్తుందని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల నాటికి ఈ నియోజకవర్గాల్లో వైసీపీ బలహీనపడుతుందనే అంచనాలు వస్తున్నాయి. అయితే, ఆ ఎన్నికల కన్నా ముందు ఈ నెల ఆఖరులో ప్రకటన విడుదల వచ్చే అవకాశం ఉన్న స్థానిక ఎన్నికల్లోనే వైసీపీకి ఎదురు దెబ్బతగులుతుందని అంటున్నారు. మరి ఈ పరిణామాలు కీలకమైన వైసీపీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.