ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. తండ్రి వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చినా తన వాక్పటిమతో ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకుంది. జాగృతి సంస్థను స్థాపించి బతుకమ్మ వేడుకలను ఖండాంతరాలను దాటించడంలో ముఖ్య భూమికి పోషించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఊహించని పరాజయం పాలయ్యాక కొన్నాళ్లు మీడియా ముందుకు రాలేదు. ఆ తరువాత షరా మామూలుగా అడపాదడపా రాజకీయాల్లో పాలు పంచుకుంటున్నారు. కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే ఇటీవల కొద్ది కాలం నుంచి మాత్రం మళ్లీ సైలంట్ అయిపోయారు. ఎక్కడా కనిపించడం లేదు. వార్తల్లోనూ ఎక్కడా ఒక్క మాట కూడా వినిపించడం లేదు. ఎందుకు? ఏమైంది? అని రాజకీయా వర్గాల్లో కొత్త చర్చకు తెరలేచింది. అక్క ఎక్కడా అని గులాబీశ్రేణులు సందేహంగా చూస్తున్నారు.
అయితే విషయమేమిటంటే నిజామాబాద్ ఎన్నికల్లో ఓటమి తరువాత కొద్ది రోజులు ముఖం చాటేంది ఈ ఎంపీ. కొద్ది రోజుల విరామం తరువాత మళ్లీ ఆమె మెయిన్ స్ర్టీమ్లోకి వచ్చింది. సరిగ్గా అప్పుడే సీఎం కేసీఆర్ ఆమెను రాజ్యసభకు పంపుతారని విపరీతంగా ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. కొందరయితే ఏకంగా ఆమెకు బీజేపీ కేబినెట్లో బెర్త్కూడా ఇప్పించనున్నారని వార్తలను వండి వార్చారు. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా మళ్లీ కవిత ఎక్కడా అంతగా కనిపించడం లేదు. రాజకీయ కార్యక్రమాల్లోనూ పా్ల్గొంటున్న దాఖాలాల్లేవు. ఏమైంటుందా? అని రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు. కొందరు ఆమెకు రాజ్యసభ దక్కడం లేదని, ఆ విషయమై సీఎం కేసీఆర్ కవితకు స్పష్టత నిచ్చారని అందుకే మళ్లీ మొహం చాటేశారని వార్తలు గుప్పు మంటున్నాయి.
అయితే అందుకు కారణమేంటంటే సొంత కూతురిని గెలిపించుకోలేక, అడ్డదారిని రాజ్యసభకు పంపారనే అపవాదు వస్తుందనే ముఖ్యమంత్రి ఆ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం సాగుతున్నది. మరోవైపు ఇటీవలే వరుసగా నిర్వహించిన స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికలో గులాబీ శ్రేణులు ఎంతో చెమటోడ్చాయి. అందులో చురుగ్గా పనిచేసిన పలువురు కీలక నేతలు కూడా ఉన్నారు. వారిని కాదని రాజ్యసభ హోదాను కూతురుకు కట్టబెడితే రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని కేసీఆర్ భావిస్తున్నట్లు పలువురు టీఆర్ ఎస్ నేతలే వివరిస్తుండడం ఇక్కడ గమనార్హం. ఈ నేపథ్యంలో కవితకు రాజ్యసభ సీటుపై ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చారని తెలుస్తున్నది. దీంతో అక్క మళ్లీ తెరమరుగైందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం సాగుతున్నది.
ఇదిలా ఉండగా తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్లు ఏప్రిల్లో ఖాళీ కానున్నాయి. ఆ ఎన్నిక ప్రక్రియ మార్చిలో ప్రారంభం కానుంది. ఆ రెండు సీట్లు అధికార టీఆర్ఎస్ ఖాతాలోనే పడడడం ఖాయం. అయితే కవితను రాజ్యసభకు పంపకపోతే ఆ రెండు సీట్లు ఎవరికి దక్కనున్నాయని కూడా ఇక్కడ ఆసక్తిగా మారింది. కేసీఆర్ ఎవరిని పెద్దల సభకు పంపనున్నారని గులాబీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఆ ఇద్దరవరనే విషయమై ఎవరికి వారుగా అంచనాలు వేసుకుంటున్నారు. అయితే అందులో ఒక సీటు మాత్రం ఎస్సీ లేదా ఎస్టీలకు దక్కే అవకాముందని తెలుస్తున్నది. మరి కేసీఆర్ చల్లని చూపు ఎవరిపై పడనున్నదో? రాజ్యసభలో ఎవరు అడుగుపెట్టేదెవరో? తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడకతప్పదు.