టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు (71) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన సోమవారం (మే22) 2 గంటలకు తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారాయన. మొదట చెన్నై, బెంగళూరులో చికిత్స తీసుకున్న ఆయన.. మెరుగైన వైద్యం కోసం నెల రోజుల క్రితం.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీలో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి శరత్ బాబు వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతున్నారు.
సోమవారం ఉదయం ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. శరత్ బాబు మృతితో టాలీవుడ్ లో విషాదా ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపట్ల పలువురు సినిమా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కాగా శరత్ బాబు పార్థీవ దేహాన్ని చెన్నైకి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు. శరత్ బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షితులు. 1973లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శరత్ బాబు.. రామరాజ్యం అనే మూవీతో తొలిసారి ప్రేక్షకుల ముందుకుకొచ్చారు.
నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగారు. మూడుముళ్ల బంధం, సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య, ఆపద్భాందవుడు లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో ఆయన నటించారు. తెలుగులోనే కాకుండా దక్షిణాది ఇతర భాషా చిత్రాల్లో కూడా నటించి తన మార్క్ చూపించారు శరత్ బాబు.
1974లో ప్రముఖ లేడీ కమెడియన్ రమాప్రభను వివాహం చేసుకున్న శరత్ బాబు.. 1988లో ఆమెతో విడిపోయారు. 1990లో స్నేహ నంబియార్ అనే మహిళను పెళ్ళాడి 2011లో ఆమెతో కూడా డివోర్స్ తీసుకున్నారు. 1973లో విడుదలైన ‘రామరాజ్యం’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శరత్ బాబు.. నటుడిగా 300కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన నటించిన చివరి సినిమా మళ్ళీ పెళ్లి.