జగన్ తన తాజా క్యాబినెట్ తో ఎన్నికలకు వెళితే తనకు పరాభవం తప్పదని.. ఇప్పుడున్న మంత్రుల్లో చాలామంది వల్ల ఎలాంటి ఉపయోగం లేదని డిసైడ్ అయినట్టే కనిపిస్తోంది. జగన్ ఏడాది క్రితం తన క్యాబినెట్లో భారీగా మార్పులు చేర్పులు చేశారు. ఈ క్రమంలోనే పాత మంత్రుల స్థానాల్లో కొత్త మంత్రులు ఎంట్రీ ఇచ్చారు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రెండున్నర సంవత్సరాల తర్వాత క్యాబినెట్లో 90 శాతం మంది మంత్రులను తప్పించి.. వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తానని చెప్పారు. అయితే కరోనా కారణంగా మూడేళ్లకు కానీ జగన్ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయలేదు.
అయితే మధ్యలో మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు వెళ్లడంతో వారి స్థానాల్లో సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణులకు మంత్రులుగా అవకాశం ఇచ్చా రు. గత ఏడాది జరిగిన మార్పులలో చాలామంది కొత్త మంత్రులు ఎంట్రీ ఇచ్చారు. అయితే మంత్రులలో చాలామంది వల్ల పార్టీకి, ప్రభుత్వానికి ఎలాంటి ఉపయోగం లేదన్న విమర్శలు ఉన్నాయి. మంత్రి పదవి ఇచ్చిన వారు అటు తమ శాఖలోనూ పట్టు సాధించలేదు.
ఇటు ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున ఏమాత్రం వాయిస్ వినిపించడం లేదు. ఈ క్రమంలోనే ఈ వారంలో జగన్ తన కేబినెట్ మళ్ళీ మారుస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఫైర్ బ్రాండ్లకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే మరో ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రివర్గంలోకి వస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఒకరిద్దరికి కూడా మంత్రి పదవులు దక్కుతాయని సమాచారం.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కొడాలి నాని – బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కూడా మరోసారి క్యాబినెట్లోకి ఎంట్రీ ఇవ్వనన్నారు. వీరిద్దరూ జగన్ తొలి క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నవారే. అలాగే నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డికి కూడా మంత్రిగా అవకాశం వస్తుందని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. జగన్ ప్రస్తుతం క్యాబినెట్లో మార్పులు చేర్పులపై తీవ్రమైన కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం.