ఈ సారి తెలుగుదేశం పార్టీ డౌట్ లేకుండా గెలిచే నియోజకవర్గాల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటని ఖచ్చితంగా లెక్క పెట్టుకోవచ్చు. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో గత ఎన్నికల్లో ఓటమి పాలైంది..కానీ అనూహ్యంగా పుంజుకుని ఇప్పుడు అక్కడ గెలుపు దిశగా వెళుతుంది. మొదట నుంచి జగ్గయ్యేపేట టిడిపికి కంచుకోటగానే ఉంది. గత నాలుగు ఎన్నికలు చూస్తే..2004లో కాంగ్రెస్ గెలిస్తే..2009, 2014 ఎన్నికల్లో వరుసగా టిడిపి గెలిచింది. టిడిపి నుంచి శ్రీరామ్ తాతయ్య విజయం సాధించారు.
కానీ 2019 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీ తేడాతో ఆయన ఓడిపోయారు. వైసీపీ నుంచి సామినేని ఉదయభాను గెలిచారు. అయితే గెలిచిన ఏడాది నుంచే ఈయనపై వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది. నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం..ఇటు పక్కనే ఉన్న అమరావతి రాజధానికి వ్యతిరేకంగా వైసీపీ నిర్ణయం తీసుకోవడం వైసీపీ ఎమ్మెల్యేలు పెద్ద మైనస్ అయింది. ఇటు టిడిపి నేత తాతయ్య నిత్యం ప్రజల్లో ఉంటూ..ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు.
అవసరమైతే సొంత డబ్బులు సైతం ఖర్చు పెడుతూ ప్రజలకు సేవ చేస్తున్నారు. చాలా తొందరగానే టిడిపి బలం పెంచారు. అందుకు జగ్గయ్యపేట మున్సిపాలిటీ ఎన్నికలో వైసీపీకి టిడిపి గట్టి పోటీ ఇచ్చింది. దాదాపు గెలిచినంత పనిచేసింది గాని.. వైసీపీ చేసిన రాజకీయం వల్ల మున్సిపాలిటీని కోల్పోయింది. అయినా సరే టిడిపి బలం పెరిగిందని చెప్పడానికి అదొక ఉదాహరణగా ఉంది.
ఇక తాతయ్య సౌమ్యుడు కావడంతో పాటు నియోజకవర్గ టీడీపీ ఎప్పుడూ ఆయన వైపే ఉంటోంది. పైగా ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి నెట్టెం రఘురాం తాతయ్యకు అన్ని విధాలా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఇటీవల సర్వేల్లో కూడా జగ్గయ్యపేటలో టిడిపి గెలవడం ఖాయమని తేలింది. దీంతో అక్కడ వైసీపీ పని అయిపోయినట్లే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో టిడిపి గెలిచే మొదట సీటు జగ్గయ్యపేట అయ్యేలా ఉంది.