ఎన్టీఆర్‌కు క‌లిసొచ్చిన క్రేజీ హీరోయిన్‌… చివ‌రి రోజుల్లో తిండిలేక రేకుల షెడ్లో…!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌లుగా గుర్తింపు తెచ్చుకున్న తరువాత ఫేడ్ అవుట్ అయిన చాలామంది హీరోయిన్స్ ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో అనే విషయం ఎవరు పట్టించుకోరు. అలా ఫేడ్ అవుట్ అయిన తరువాత సంపాదించిన డబ్బులతో బిజినెస్ రన్ చేస్తూ స్థిరపడిన వారు కొంతమంది ఉంటే.. సంపాదించిన డబ్బు అంతా పోయి ఆర్థిక కష్టాలతో గుండె నిండా శోకంతో అర్ధాంతరంగా కన్నుమూసిన నటీనటులు ఎంతోమంది ఉన్నారు. అందులో ఒకరే కే. మాలతి.

ఇక సీనియర్ ఎన్టీఆర్ పక్కన హీరోయిన్గా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈమె తర్వాత కాలంలో ఎటువంటి దుర్భర జీవితం గడిపిందో?ఎన్ని కష్టాలు అనుభవించిందో? తెలిస్తే కంటతడి పెట్టక మానరు. కే. మాలతి తెలుగింటి అమ్మాయి. 1926లో ఏలూరులో జన్మించిన ఈమె తండ్రి గొల్లపూడి సూర్యనారాయణ 5 ఏటనే చనిపోయిన బడికి వెళ్లి విద్యను కొనసాగించింది. సంగీతం నేర్చుకుని, నాటకాల్లో కూడా పాల్గొంది. చిన్నతనంలోనే పెళ్లి చేసుకున్న మాలతి భర్త వీరాచారి ఎంకరేజ్మెంట్తో సినిమాల్లో అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఉషా సినిమాలో పార్వతి దేవిగా నటించిన మాలతి ఈ సినిమా సక్సెస్ కాకపోయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక రెండో సినిమా సుమంగళి ఇందులో ఆమె పాడిన వస్తాడే మా బావ చాలా కాలం వరకు ప్రేక్షకుల్లో గుర్తుండిపోయింది. ఇక పాతాళ భైరవి సినిమాతో ఎన్టీఆర్ స‌ర‌సన నటించిన మాలతి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్‌ అందుకున్న ఆమెకు అంతగా అచ్చు రాలేదు. 3 ఏళ పాటు ఏ సినిమా అవకాసం లేకుండా ఖాళీగా ఉంది. తర్వాత కాళహస్తి మహత్యం సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన మాలతి తర్వాత హీరోయిన్గా అవకాశాలు తగ్గిపోవడంతో ఎన్టీఆర్‌కు సోదరిగా కూడా నటించిందట. తను చివరిగా 1979లో శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం సినిమాలో నటించింది.

భర్త మరణించిన త‌ర్వాత‌ మాలతి మద్రాసు నుంచి హైదరాబాద్‌కి షిఫ్ట్ అయింది. కాచిగూడ ప్రభాస్ థియేటర్స్ వెనుక రేకుల షెడ్ లో మాలతి ఒంటరిగా జీవించేది. రోజు పక్కనే ఉన్న గుడికి రెండు పూటలా వెళ్లి పూజారి ఇచ్చే ప్రసాదంతో కడుపు నింపుకునేది. తను ఒక స్టార్ యాక్టర్ అన్న విషయం ఎవరికీ చెప్పుకునేది కాదు. అలా 1979 నవంబర్ 25న పెనుగాలి వీచడంతో ప్రభాస్ థియేటర్‌కు చెందిన 20 అడుగుల గోడ కూలి మాలతి ఇంటి పైకప్పు పై పడింది.

ఇక దాంతో ఆ రేకుల షెడ్ నేలమట్టం అయింది. శిధిలాల కింద చిక్కుకున్న మాలితిని ఉస్మానియా హాస్పిటల్ కి తీసుకువెళ్లే లోపే ఆమె మరణించింది. ఇంట్లో ఉన్న ట్రంకు పెట్టి తెరిచి చూస్తే ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఫోటోలు కనిపించాయి. అప్పుడే చాలామందికి ఆమె పాతాళ భైరవి హీరోయిన్ అని తెలిసింది. అలాగే ఆమె కష్టాలను, బాధలను రాసుకున్న పర్సనల్ డైరీ కనిపించింది దాన్ని చదివిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారట‌.