అధికార వైసీపీలో వింత పరిస్తితులు నడుస్తున్నాయి..ఆ పార్టీని రాజకీయ ప్రత్యర్ధులే దెబ్బకొట్టకుండా…సొంత పార్టీ వాళ్లే దెబ్బతీసేలా ఉన్నారు. ఆ పార్టీలో నడుస్తున్న అంతర్గత పోరు పార్టీకి బాగా డ్యామేజ్ చేసేలా ఉంది. అసలు ఆ పార్టీలో గడ్డు పరిస్తితులు కనిపిస్తున్నాయి..విచిత్రంగా సొంత ఎమ్మెల్యేలే అధిష్టానంపై అసంతృప్తిగా ఉంటే..ఎమ్మెల్యేలపై సొంత నేతలు అసంతృప్తిగా ఉంటున్నారు.
ఇదే పంచాయితీ కొనసాగుతూనే ఉంది. అయితే చాలా నియోయజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై సొంత నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సరిగా ప్రజల్లో ఉండకపోవడం, అక్రమాలు ఎక్కువగా ఉండటంతో సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యేల తీరుని తప్పుబడుతున్నారు. వారి వల్ల పార్టీకే నష్టమని అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇదే క్రమంలో శృంగవరపు కోట ఎమ్మెల్యే కబుబండి శ్రీనివాసరావుపై సొంత పార్టీ నేతలు పీకల్లోతు కోపంతో ఉన్నారు.
గత ఎన్నికల్లో ఏదో జగన్ గాలిలో గెలిచిన ఈయన..ప్రజల్లో ఉండటం తక్కువ..ప్రజా సమస్యలని పట్టించుకునేది లేదు. అభివృద్ధి చేయడం లేదు. పైగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అక్రమాలు పెరిగాయని ప్రతిపక్షాలు కాదు..సొంత పార్టీ వాళ్లే ఆరోపిస్తున్నారు. అంటే ఎస్ కోటలో పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇటీవల ఎస్ కోటలోని కీలక వైసీపీ నేతలు ఏకంగా విశాఖ వెళ్లి వైసీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను కలిసి తమకు ఎమ్మెల్యే వద్దని కోరినట్లు తెలిసింది.
వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలని, లేదంటే తాము సహకరించబోమని తేల్చి చెప్పారని సమాచారం. అటు ఎమ్మెల్యే పలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. మొత్తానికి ఇక్కడ ఎమ్మెల్యేని సొంత పార్టీ వాళ్లే ఓడించేలా ఉన్నారు. ఇదే సమయంలో ఇక్కడ టిడిపి వేగంగా బలపడుతుంది. అసలే ఇది టిడిపి కంచుకోట. గత ఎన్నికల్లో జగన్ గాలిలో ఓడిపోయింది..కానీ ఈ సారి ఇక్కడ టిడిపి పక్కాగా గెలవడం ఖాయమని తెలుస్తోంది.