ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో పనితీరు సరిగా లేని మంత్రులను పక్కన పెడతాను అని వార్నింగ్ ఇచ్చినట్టు విషయం బయటకు వచ్చింది. పనితీరు ఆధారంగానే క్యాబినెట్లో మార్పులు చేర్పులు ఉంటాయని జగన్ క్లియర్ గానే చెప్పేసారని అంటున్నారు. ఇప్పటికే జగన్ ముగ్గురు.. నలుగురు మంత్రులకు రెండు మూడుసార్లు వార్నింగులు ఇచ్చేశారు. అయినా కూడా కొందరు పనితీరు ఏమాత్రం బాగోలేదని జగన్ దగ్గర నివేదికలు ఉన్నాయి.
ప్రస్తుతం లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసాయి. ఆ తర్వాత ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చిన వెంటనే జగన్ క్యాబినెట్లో మార్పులు చేర్పులు చేస్తారని అంటున్నారు. మరీ ముఖ్యంగా మండలి నుంచి కొందరు మంత్రులకు అవకాశం వస్తుందని వైసిపి వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక యంగ్ వైసీపీ లీడర్ కు మంత్రి పదవి అనూహ్యంగా దక్కనుంది అన్న చర్చలు కూడా గోదావరి జిల్లాలలో వినిపిస్తున్నాయి. ఎవరో కాదు త్వరలో ఎమ్మెల్సీ కాబోతున్న పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ కౌరు శ్రీనివాస్.
కౌరు శ్రీనివాస్ రాజకీయ ప్రస్థానం చాలా చిత్ర విచిత్రంగా జరిగింది. 2014లో వీరవాసరం ఎంపీపీగా ఉన్న శ్రీనివాస్ ను జగన్ ఆచంట ఇన్చార్జిగా నియమించారు. అయితే చెరుకువాడ రంగనాథరాజు కోసం కౌరు తన టికెట్ త్యాగం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ కౌరుకు డిసిసిబి చైర్మన్ పదవి ఇచ్చారు. ఆ వెంటనే రాజమహేంద్రవరం జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కూడా ఇచ్చారు. అనంతరం పాలకొల్లు నియోజకవర్గం ఇన్చార్జి పగ్గాలు కట్టబెట్టారు. ఆ వెంటనే యలమంచిలి నుంచి జడ్పీటిసిగా పోటీ చేయడంతో పాటు పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ పదవి ఇచ్చారు.
కేవలం పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో కౌరుకు అన్ని పదవులు దక్కాయి. ఏ వైసీపీ నేతకు కూడా ఇన్ని పదవులు రాలేదు. ప్రస్తుతం జగన్ స్థానిక సంస్థల కోటాలో కౌరుకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. ఆయన ఎమ్మెల్సీగా గెలవడం లాంఛనం కానుంది. కౌరు ఎమ్మెల్సీ అయిన వెంటనే మంత్రి పదవి కూడా వస్తుందని సామాజిక సమీకరణలు కూడా ఆయనకు కలిసి వస్తాయని వైసిపి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కౌరు శ్రీనివాస్ కు క్యాబినెట్ బెర్త్ దక్కితే ప్రస్తుతం శెట్టిబలిజ సామాజిక వర్గం నుంచి మంత్రిగా ఉన్న రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పదవికి ముప్పు తప్పదని అంటున్నారు. ఏదేమైనా కౌరు… చెల్లుబోయిన మంత్రి పదవికి ఎర్త్ పెడతారా లేదా ? అన్నది కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతానికి ఈ ప్రచారం అయితే జోరుగా నడుస్తోంది.