చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ ఇంటిపై ఐటీ అధికారులు ఐదురోజులుగా సోదాలు చేశారు. రూ. 2వేల కోట్ల కుంభకోణం జరిగిందని, పలు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారని, సదరు పీఎస్ అప్రూవర్గా మారాడాని సాక్షి, మరికొన్ని పలు పత్రికల్లో వార్తలు వచ్చాయి మినహా ఐటీ శాఖ అధికారులు అధికారంగా ఇప్పటి వరకు ఎలాంటి చార్జిషీట్లు దాఖలు చేయలేదు. అంతలోనే అవినీతిలో తెలుగు తమ్ముళ్లు.. భారీ మొత్తంలో అక్రమాస్తులు అంటూ పుంఖాను పుంఖాలుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనినై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా దీనిపై ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు స్పందించారు. వైసీపీ నేతలు, సాక్షి మీడియా కావాలనే టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే.. అసలు పీఏలు, పీఎస్లతో పార్టీలతో సంబంధం ఏముంటుందని ప్రశ్నించారు. ఆయ నొక ప్రభుత్వ అధికారి మాత్రమేనని, ఐటీ దాడులు ఆయన వ్యక్తిగతమని,. వాటిని టీడీపీకి ముడిపెట్టడం సరికాదని హితవు పలికారు. 40ఏళ్ల చంద్రబాబు రాజకీయ చరిత్రలో 10-15మంది పీఎస్లు, పీఏలు పని చేశారని గుర్తు చేశారు. సీఏం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల నుంచి తప్పించుకునే మార్గం లేకనే, ఎదుటివాళ్లపై దాడులు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు..జగన్ షెల్ కంపెనీల సృష్టికర్త విజయసాయి రెడ్డేనని..వాటిని కప్పిపుచ్చుకోడానికే ఢిల్లీ స్థాయి పదవులు ఇచ్చారని ఆరోపించారు. జగన్ రూ 43వేల కోట్ల అక్రమాస్తుల విచారణ తుదిదశకు చేరిందని…ఇప్పటికే రూ 4వేల కోట్ల జగన్ ఆస్తులను ఈడీ జప్తు చేసిందని, విచారణ తుది దశకు చేరిందని, అందుకే కోర్టుకు హాజరు కాకుండా జగన్ ఎగ్గొడుతున్నారని ఆయన ఆరోపించారు. 16నెలలు జైల్లో ఉండి వచ్చి, 16 ఛార్జిషీట్లు ఉన్న జగన్కు తమను ప్రశ్నించే నైతిక హక్కు లేదని విమర్శించారు. చంద్రబాబుపై గతంలోనే 26ఎంక్వైరీలు వేశారని, ఏవీ రుజువు చేయలేక పోయారని గుర్తు చేశారు. ఇకనైనా టీడీపీపై సాక్షి మీడియా, వైసీపీ నేతలు తమ విష ప్రచారాన్ని మానుకోవాలని, లేకుంటే న్యాయ పరచర్యలు తీసుకుంటామని యనమల హెచ్చరించారు.