దిగులు పడకురా సహోదరా.. అంటూ ఆటో కార్మికుల భుజం తట్టారు.. టీడీపీ యువ నాయకుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి, గోపాలపురం నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ మద్దిపాటి వెంకటరాజు. ఆటోనే జీవితాన్ని చేసుకుని.. రోడ్లపై బతుకు తెరువు వెతుక్కునే కార్మికులకు జీవిత భద్రత మృగ్యమైన విషయం తెలిసిం దే. ఏ ప్రమాదం సంభవించినా.. తొలి బాధితుడిగా.. ఆటో డ్రైవర్ నిలుస్తాడు. అతని కుటుంబం దిక్కులేని పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇలాంటి స్థితిలో ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండాలంటే.. అంతో ఇంతో బీమా సౌకర్యం ఉంటే బాగుంటుందని వెంకట రాజు తలపోశారు.
అనుకున్నదే తడవుగా.. ఆయన ఆటో కార్మికులకు ఏకంగా రూ.5,00,000 విలువైన బీమా సౌకర్యాన్ని కల్పిం చారు. కార్మికుల దినోత్సవం సందర్భంగా మే 1న ఈ బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దిగువ మధ్యతరగతి కుటుంబం నుండి అంచెలంచెలుగా ఎదుగిన మద్దిపాటి.. ఆయా కుటుంబాల్లోని పెద్దదిక్కు ఆకస్మికంగా మరలిరాని లోకాలకు తరలిపోతే.. ఆ కుటుంబాలు పడే ఆవేదనను కళ్లారా గమనించారు. ఈకష్టం మరెవరికీ రాకూడదన్న సంకల్పంతో ఆయన ఈ బీమా అంశానికి పదును పెట్టారు.
ఖర్చుకు వెరవకుండా.. ఒక్కొక్క ఆటో డ్రైవర్కు రూ.500000 మేరకు బీమా చేయించారు. `దిగులు పడకు రా సహోదరా!` అని ఆటో కార్మికుల భుజాలు తట్టి.. వారి జీవితాలకు బీమా వెలుగులు ప్రసాదించారు. “సామాజిక భద్రత”ను స్వాపలంబనగా చేసుకుని నియోజకవర్గ కేంద్రమైన గోపాలపురం మండలంలోని ప్రతి ఆటో డ్రైవరుకు 5 లక్షల ప్రమాద బీమా పాలసీని మద్దిపాటి తన సొంత నిధులతో చేయించారు. కార్మిక దినోత్సవం సందర్భంగా ఆయన ఆయా బాండులను డ్రైవర్లకు అందించారు.
మద్దిపాటి దూర దృష్టి.. ఆటో కార్మికుల జీవితాల్లో వెలుగులు ప్రసరించేలా వారి కుటుంబాలకు అండగా నిలిచేలా తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుండడం గమనార్హం. నియోజకవర్గంలో ఇప్పుడు ఏ ఆటో డ్రైవర్ను పలకరించినా.. మద్దిపాటి బీమా విషయాన్నే ప్రస్తావిస్తున్నారు. ఆయన తమ కుటుంబాలకు అందించిన బీమా ధీమా గురించే మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చేయలేకపోయిన పనిని.. ఒంటిచేత్తో ఆయన చేశారని వేనోళ్ల కొనియాడుతున్నారు. రాజకీయ నాయకులు పార్టీలతో సంబంధం లేకుండా ఆటో కార్మికులకు ఇలాంటి సాయాలు చేస్తే వారి కుటుంబాలకు ఓ బలమైన భరోసా ఉన్నట్టు ఉంటుంది.