వచ్చే ఎన్నికల్లో ఏపీలో జనసేన – తెలుగుదేశం – బిజెపి మధ్య పొత్తు కుదురుతోన్న నేపథ్యంలో ఈ మూడు పార్టీలకు చెందిన నేతల మధ్య చర్చలు మొదలయ్యాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జనసేనకు 20 నుంచి 25 అసెంబ్లీ సీట్లతో పాటు మూడు లోక్సభ సీట్లు ఇస్తారని తెలుస్తోంది. జనసేన పోటీ చేసే లోక్సభ సీట్లలో అనకాపల్లి – కాకినాడ – నరసాపురం తో పాటు రాజంపేట సీటు పేరు కూడా పరిశీలనలో ఉంది.
ఇక బిజెపితో పొత్తు కుదిరితే రెండు లోక్సభ సీట్లతో పాటు నాలుగు నుంచి ఐదు అసెంబ్లీ సీట్లు ఇస్తారని తెలుస్తోంది. బిజెపి ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి నరసరావుపేట నుంచి లోక్సభకు పోటీ చేస్తారని సమాచారం. ఇక మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విశాఖ నార్త్ నుంచి – కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్ పోటీ చేసే ఛాన్సులు ఉన్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి భీమవరం లేదా గాజువాకలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.
ఇక బిజెపి నేతలు నరసరావుపేట లోక్సభ సీటు తో పాటు తిరుపతి లోక్సభ సీటు నుంచి కూడా పోటీ చేస్తారని సమాచారం. ఇక జనసేన పోటీ చేసే సీట్లలో ఉభయగోదావరి, విశాఖపట్నం జిల్లాల నుంచి ఎక్కువ సీట్లు కేటాయిస్తారని.. కృష్ణా జిల్లాలో రెండు – గుంటూరు జిల్లాలో రెండో అసెంబ్లీ సీట్లు ఇస్తారని తెలుస్తోంది.
త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వస్తుందని.. మూడు పార్టీల ఉమ్మడి కమిటీ కూడా ఏర్పాటు చేస్తారని సమాచారం.