జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందన్నట్టుగా ఉందట .. వైసీపీ వ్యవహారం. పార్టీని బలోపేతం చేయడం లో వైసీపీ నేతలు పడుతున్న పోటీ కారణంగా.. టీడీపీ బలోపేతం అవుతున్న పరిస్థితి రాజమండ్రిలో కనిపిస్తోంది. రాజమండ్రి సిటీ, రూరల్ నియోజకవర్గాలను తీసుకుంటే.. 2019 ఎన్నికల్లో ఇక్కడ రెండు స్థానాలను కూడా టీడీపీ కైవసం చేసుకుంది. అయితే.. ఈ రెండు స్థానాలను ఏమాత్రం వైసీపీ దృష్టి పెట్టినా.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి జారిపోతాయనే చర్చ కొన్నాళ్ల కిందట సాగింది.
ఎంపీ భరత్ ఇక్కడ దూకుడు చూపించారు. దీంతో సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు తథ్యమని కూడా ఆయన ప్రకటించారు. అయితే.. పరిస్థితులు ఒకే రకంగా కనిపించడం లేదు. ఇప్పుడు ఈ రెండు నియోజకవర్గాల్లోనూ.. వైసీపీలో పోటా పోటీగా నాయకులు కనిపిస్తున్నారు. ఎవరికి వారు.. పోటా పోటీగా కామెంట్లు చేసుకుంటున్నారు. దీంతో వైసీపీలో పోరు.. పరోక్షంగా టీడీపీకి వరంగా మారనుందని.. ఇప్పుడు తాజా టాకష్.
రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్గా చందన నాగేశ్వర్ను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నియమించారు. వాస్తవానికి ఇది అధిష్టానం ఆదేశాలతోనే చేశారు. కానీ, ఇక్కడే ఎంపీ భరత్.. పితాని మురళీ రామకృష్ణను తీసుకువచ్చి.. యువజన విభాగం అధ్యక్షుడిగా చేశారు. ఇది కూడా వైసీపీ అధిష్టానానికి చెప్పే చేశారు. అయితే.. వీరిద్దరూ కూడా రూరల్ పై దృష్టి పెట్టారు. తాను రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని నాగేశ్వర్.. కాదు నేనే చేస్తానని.. పితాని ప్రకటించారు.
మరోవైపు.. ఎంపీ భరత్ కూడా వచ్చే ఎన్నికల్లో సిటీ నుంచి పోటీ చేస్తానని అంటున్నారట. మరోవైపు ఇదే నియోజకవర్గం నుంచి రీజనల్ కో-ఆర్డినేటర్గా నియమితులైన జక్కంపూడి గణేష్ ఫోకస్ పెడుతున్నారు. అంతేకాదు.. త్వరలోనే వైసీపీ యువ సమ్మేళనం బహిరంగ సభను రాజమండ్రిలోనే భారీ ఎత్తున నిర్వహిస్తామని గణేష్ ప్రకటించారు. దీంతో ఈ నలుగురు వ్యవహారంతో రెండు నియోజకవర్గాల్లోనూ వైసీపీ శ్రేణులు గందరగోళంలో చిక్కుకున్నారు. ఇక, ఇదే సమయంలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే వార్ మధ్యలో వ్యూహాత్మకంగా బలోపేతం అవుతుండడం గమనార్హం. ఇదీ.. సంగతి.